గత సోమవారం నాడు కొండపేట గ్రామానికి చెందిన బాలుడు కె.చైతన్య హత్యకు సంబంధించి అదే గ్రామానికి చెందిన ఇద్దరు బాలురను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఇన్చార్జి సీఐ కె.రామారావు తెలిపారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గత సోమవారం విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం, కొండపేట గ్రామానికి చెందిన చైతన్య హత్యకు గురయ్యాడు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దీనిపై వివరాలు సేకరించగా, అదే గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లకు చైతన్యకు ఆన్లైన్ గేమ్ ఆడుతుండగా వారం కిందట వివాదం చెలరేగింది. చైతన్యపై కక్ష గట్టి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో వారు చైతన్యను గ్రామ సమీపంలో కొండ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ కూడా వివాదం తలెత్తడంతో ఇద్దరు మైనర్లు చైతన్యను రాయితో మోది చంపేశారు. దీంతో నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా ఇద్దరు మైనర్లను అరెస్టు చేసి, రిమాండ్ తరలించామని సీఐ తెలిపారు.