ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రిజ్ భూషణ్ కుమారుడి కారు బీభత్సం.. ఇద్దరు యువకులు మృతి

national |  Suryaa Desk  | Published : Wed, May 29, 2024, 10:14 PM

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఓ బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే దుర్మరణం పాలయ్యారు. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలతో బ్రిజ్ భూషణ్‌కు బీజేపీ టికెట్ నిరాకరించగా.. ఆయన సిట్టింగ్ స్థానం కైసర్‌గంజ్‌ను అతని కుమారుడు కరణ్ భూషణ్‌ సింగ్‌కు ఈసారి ఇచ్చింది. ఈ క్రమంలోనే కైసర్‌గంజ్‌ నియోజకవర్గంలో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20 వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సంఘటన వెలుగుచూడటం తీవ్ర సంచలనంగా మారింది.


కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్‌లోని యూపీ 32 హెచ్‌డబ్ల్యూ 1800 నంబరు గల టయోటా ఫార్చ్యూనర్ కారు బుధవారం ఉదయం 9 గంటల సమయంలో అతి వేగంతో వెళ్తూ ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హుజూర్‌పూర్-బహ్రైచ్ రైల్వే క్రాసింగ్ సమీపంలో గోండా వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న 17 ఏళ్ల రెహాన్.. 24 ఏళ్ల షెహజాద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 65 ఏళ్ల వృద్ధురాలు సహా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు కొన్ని మీటర్ల దూరంలో ఎగిరి పడిపోయారు.


ప్రమాదానికి కారణం అయిన ఆ టయోటా ఫార్చ్యూనర్ కారుపై పోలీస్ ఎస్కార్ట్ అని రాసి ఉంది. ఈ ఘటనలో ఆ కారు ముందు భాగం తీవ్రంగా ధ్వంసం అయింది. ఈ ప్రమాదం జరగ్గానే ఆ కారు ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో.. డ్రైవర్‌తోపాటు అందులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ కారులో ఉన్న వారు అక్కడి నుంచి పరారయ్యరు. అయితే ఈ యాక్సిడెంట్ సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కరణ్‌ భూషణ్‌ సింగ్ ఆ కారులో ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.


ఇక ఈ సంఘటన తెలిసిన స్థానికులు.. గాయపడినవారు చికిత్స పొందుతున్న ఆస్పత్రిని ముట్టడించారు. బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ ప్రమాదంలో మృతుడు రెహాన్‌ ఖాన్‌ తల్లి చందాబేగం.. కల్నల్‌గంజ్‌ కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com