ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. మరో మూడు రోజుల్లోనే.. త్వరపడండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 07:48 PM

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేయనుంది. మే 20వ తేదీ నుంచి విత్తనాల పంపిణీ మొదలుకానుంది. ఇందుకోసం రైతు భరోసా కేంద్రాలలో ఇప్పటికే పచ్చిరొట్ట, వేరుశనగ విత్తనాలను సిద్ధం చేశారు. విత్తనాలు కావాల్సిన రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవటం ఇప్పటికే ప్రారంభమైంది. మే 20వ తేదీ నుంచి విత్తనాలు పంపిణీ చేస్తారు. మరోవైపు జూన్ ఐదు నుంచి వరి, ఇతర విత్తనాలను పంపిణీ చేయనున్నారు.


ఖరీఫ్ సీజన్‌లో విత్తన పంపిణీ కోసం ఏపీ ప్రభుత్వం రూ.450 కోట్లు కేటాయించింది. ఇందులో సుమారుగా రూ.195 కోట్లను సబ్బిడీ రూపంలో భరించనుంది. విత్తన పంపిణీ కోసం వ్యవసాయశాఖ అధికారులు 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేశారు. 2.99 లక్షల క్వింటాళ్ల వేరుశెనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్టె విత్తనాలు, 2.26 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలను పంపిణీ కోసం సిద్ధం చేశారు. పచ్చిరొట్టె, చిరుధాన్యాలపై 50 శాతం, వేరుశెనగ విత్తనాలపై 40 శాతం, అపరాలపై 30 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. వరికి మాత్రం జాతీయ ఆహార భద్రతా మిషన్ పరిధిలో ఉన్న జిల్లాల్లో క్వింటాల్ వేయి చొప్పున, మిషన్ పరిధిలో లేకపోతే రూ.500 చొప్పున సబ్బిడీ ఇస్తున్నారు.


విత్తనాల పంపిణీ ఇప్పటికే మొదలుకావాల్సి ఉన్నప్పటికీ.. ఏపీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. పోలింగ్ ముగిసేవరకూ విత్తన పంపిణీ వద్దంటూ ఈసీ ఆంక్షలు విధించింది. దీంతో విత్తన పంపిణీకి బ్రేకులు పడగా.. ఇప్పుడు పోలింగ్ పూర్తికావటంతో రైతులకు విత్తనాలను అందించేందుకు వ్యవసాయశాఖ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే విత్తనాల పంపిణీకి ఏపీ విత్తనాభివృద్ధి సంస్థతో కలిసి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com