ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు వ్యాఖ్యలకు హర్ట్.. టిప్పర్ నడుపుతూ వచ్చి నామినేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 24, 2024, 07:37 PM

ఏపీలో ప్రస్తుతం నామినేషన్ల పండగ నడుస్తోంది. రేపటితోనే ఆఖరిరోజు. ఇక నామినేషన్ల దాఖలు కార్యక్రమం అంటే మామూలుగా ఉండదు మరి. అనుచరుల కార్ల ర్యాలీలు, కార్యకర్తల డ్యాన్సులు, డప్పు సౌండ్లు, టపాకాయల మోతలు అంతుటది మరి. కానీ.. ఆ నియోజకవర్గ అభ్యర్థి మాత్రం డిఫరెంటుగా ప్లాన్ చేశారు. టిప్పర్ లారీ నడుపుకుంటూ వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అదేంటీ ఆయనెందుకు అలా వెళ్లి నామినేషన్ వేశారంటే.. దాని వెనుక కూడా ఓ కథ ఉంది మరి.


ఉమ్మడి అనంతపురం జిల్లా శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేస్తున్నారు వీరాంజనేయులు. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన శింగనమలలో సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని కాదని మరీ.. వీరాంజనేయులుకు జగన్ ఛాన్సిచ్చారు. వీరాంజనేయులు తండ్రి గతంలో సర్పంచ్‌గా పనిచేశారు. వైసీపీలో యాక్టివ్‌గా పనిచేస్తూ వచ్చిన వీరాంజనేయులుకు ఇలా అవకాశం వచ్చింది. అయితే వీరాంజనేయులు గతంలో టిప్పర్ డ్రైవర్‌గా పనిచేశారు. జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి వద్ద టిప్పర్ డ్రైవర్‌గా పనిచేసిన్నట్లు వీరాంజనేయులు పనిచేసినట్లు తెలిసింది. అయితే టిప్పర్ డ్రైవర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇటీవల వైరల్ అయ్యాయి.


ఈ నేపథ్యంలో నామినేషన్ వేసేందుకు టిప్పర్లో వచ్చారు వీరాంజనేయులు. భారీ జన సందోహం మధ్య టిప్పర్ వాహనాన్ని స్వయంగా వీరాంజనేయులు నడుపుకుంటూ వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతితో పాటు.. ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి. ఇతర ముఖ్య నాయకులతో ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ అనంతరం మాట్లాడిన వీరాంజనేయులు.. ఒక సామాన్యుడు అసెంబ్లీకి వెళ్లాలన్న ఉద్దేశ్యంతో జగన్ తనకు టికెట్ ఇచ్చారని చెప్పారు. జగన్ ఆశయాన్ని నెరవేర్చేందుకు శింగనమల ప్రజలు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.


  చంద్రబాబుకు పేదలన్నా, దళితులన్నా చిన్నచూపని చెప్పిన వీరాంజనేయులు.. అందుకే నా ఆర్థిక పరిస్థితి, నా వృత్తిని అవమానించారన్నారు. టిప్పర్ డ్రైవర్ అని అవమానించిన చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కచ్చితంగా ఈ ఎన్నికల్లో శింగనమలలో భారీ విజయం సాధిస్తామని.. జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా అవుతారని ధీమా వ్యక్తం చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com