తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. భక్తుల సౌకర్యార్థం జులై నెలకు సంబంధించి దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటా ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
తిరుమల శ్రీవారి వర్చువల్ సేవల కోటా టికెట్లు ఏప్రిల్ 22నవిడుదల
తిరుమల శ్రీవారి వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణం టోకెన్లు ఏప్రిల్ 23న రిలీజ్
తిరమల శ్రీవారి జులై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్ లైన్ కోటాను ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ఏప్రిల్ 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా.. తిరుమల, తిరుపతిలో వసతి గదుల విడుదల
జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో జూలై నెల గదుల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
అలాగే ఏప్రిల్ 27న శ్రీవారి సేవ ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. తిరుమల శ్రీవారి భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
ఏప్రిల్ 17 నుంచి 19వ తేదీ వరకు కోదండరామాలయంలో శ్రీ రామనవమి ఉత్సవాలు
తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 17న శ్రీ రామనవమి సందర్భంగా ఉదయం మూలవర్లకు అభిషేకం, ఉదయం 8 నుంచి 9 గంటలకు శ్రీ సీత లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.
ఏప్రిల్ 18న తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు టీటీడీ పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
ఏప్రిల్ 19న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 8-30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఏప్రిల్ 20వ తేదీన ఖనిజ తోట ఉత్సవం జరుగనుంది.
శ్రీకోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.