ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయదులు, న్యాయమూర్తులను సోషల్ మీడియాలో దూషించిన కేసులో రెండవ నిందితుడు మణి అన్నపురెడ్డిపై ప్రముఖ న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. మణి అన్నపురెడ్డి మారు వేషంలో ఇండియాలో తిరుగుతున్నా సీబీఐ పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరికాసేపట్లో హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్కు ఈ ఫిర్యాదును న్యాయవాది అందించనున్నారు. కాగా.. గతంలో జడ్జిలను దూషించిన వ్యవహారంలో లక్ష్మీనారాయణ హైకోర్టుకు ఫిర్యాదు చేయగా.. కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలోనే మణి అన్నపురెడ్డి విదేశాల్లో ఉన్నారని సీబీఐ గతంలో హైకోర్టుకు తెలియజేసింది. అతనికి నోటీసులు జారీ చేసి ఇంటర్పోల్ సహాయం కూడా తీసుకుంటున్నామని పేర్కొంది. కానీ మణి అన్నపురెడ్డి పేరు మార్చుకుని ఇండియాకు వచ్చి వైసీపీ ప్రచారంలో పాల్గొంటున్న విషయాన్ని లక్ష్మీనారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 15 రోజుల క్రితం మణి అన్నపురెడ్డి ఇండియాకు వచ్చి సిద్ధం సభల్లో పాల్గొన్నారని.. అలాగే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కూడా పాల్గొన్నారని తెలిపారు. అంతే కాకుండా వేదికపై ఫోటోలు దిగడాన్ని న్యాయవాది గుర్తించారు. ఈ క్రమంలో పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్లను ఫిర్యాదుకు జత చేశారు. వైసీపీ అధినేత జగన్, వైసీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి విజయసాయి రెడ్డితో దిగిన ఫోటోలను కూడా యాడ్ చేశారు. వెంటనే మణిని అరెస్ట్ చేయాల్సిందిగా సీబీఐకు ఆదేశాలు ఇవ్వాలని లక్ష్మీనారాయణ కోరారు. ఈ మేరకు కోర్టు ప్రారంభమైన వెంటనే ఫిర్యాదును రిజిస్ట్రార్కు ఇస్తామని న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వెల్లడించారు.