ఆంధ్రప్రదేశ్లో ఎండలు, వేడిగాలుల తీవ్ర పెరుగుతోంది. కోస్తా జిల్లాల్లో మోస్తరు వేడిగాలులు వీస్తుండగా.. ఉత్తరాంధ్రలో తీవ్రంగా వీస్తున్నాయి. ఆదివారం 67 మండలాల్లో మోస్తరుగా, 35 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. నంద్యాల జిల్లా గోస్పాడులో 43.4, మన్యం జిల్లా నవగాం, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 43.3, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో 42.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 31 మండలాల్లో వేడి గాలులు వీస్తాయని, శ్రీకాకుళం నుంచి పల్నాడు వరకు 139 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
రాష్ట్రంలో కొంత తగ్గుముఖం పట్టిన వేడిగాలుల తీవ్రత మళ్లీ మొదలుకానుంది. అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. నాలుగైదు రోజుల క్రితం ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఫలితంగా ఉష్ణతాపం తగ్గుతుందని ఐఎండీ అంచనా వేసింది. అయితే.. మారిన వాతావరణ పరిస్థితులతో అవి రాష్ట్రంపై ప్రభావం చూపించకపోవడంతో వానలు పడలేదు. దీంతో ఉష్ణోగ్రతల పెరుగుదల మొదలై వడగాడ్పులు మళ్లీ ఉధృతమవుతున్నాయి.
సోమవారం నుంచి ఇవి తీవ్రరూపం దాల్చనున్నాయి. రానున్న మూడు రోజులు పలుచోట్ల 41నుంచి 44 డిగ్రీలు, కొన్నిచోట్ల 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 45 డిగ్రీలు, విజయనగరం జిల్లాలో 44, శ్రీకాకుళం, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో 43, అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు అంటున్నారు.