ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిని కదల్చడం జగన్ వల్ల కానిపని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 13, 2024, 09:38 PM

 ఎంతమంది వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నాడు. ఏపీ ఎన్నికలు 2024  ప్రచారంలో భాగంగా తాడికొండలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగన్‌ లాంటివాళ్లు వెయ్యి మంది వచ్చినా రాజధానిని కదల్చలేరని అన్నారు. వైసీపీ సర్కార్‌ రాజధాని రైతులను ఇబ్బందులు పెట్టారని పేర్కొన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా మారుస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో మళ్లీ ఎన్డీఏనే వస్తుందని చంద్రబాబు దీమా వ్యక్తం చేశారు. తాను వచ్చాక మళ్లీ ప్రజావేదికను నిర్మిస్తానని చెప్పారు. జగన్‌ సభలకు రూ.కోట్లు ఖర్చు చేసినా జనం రావడం లేదని ఎద్దేవా చేశారు. జగన్‌ పాలనతో ఈ రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ సర్కార్‌పై కక్ష తీర్చుకునే అవకాశం వచ్చిందని అన్నారు. ‘‘ నేను సీఎంగా ఉంటే 2020లోనే పోలవరం పూర్తయ్యేది. పోలవరం పూర్తి చేశాక నదుల అనుసంధానం చేద్దామనుకున్నాను. వైసీపీ నేతలకు కమిషన్లు ఇవ్వలేక పరిశ్రమలు పారిపోయాయి. రాష్ట్ర యువతకు వైసీపీ తీరని ద్రోహం చేసింది’’ అని చంద్రబాబు మండిపడ్డారు. కూటమి పాలనలో ఉద్యోగులు, పోలీసులను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్‌ విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని, బడికి రంగులు వేస్తే విద్యావ్యవస్థ మారిపోతుందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో యువతను జగన్‌ మోసం చేశారని ధ్వజమెత్తారు. ప్రజలంతా అండగా ఉంటే రాష్ట్రాన్ని బాగు చేసుకోవచ్చునని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com