అల్లూరు జిల్లాలోని రహదారి సౌకర్యం సరిగా లేక మరణించిన కుమారుడిని తండ్రి భుజాలపై వేసుకుని కొండలను దాటి 8 కిలోమీటర్లను నడిచి స్వస్థాలనికి వెళ్లిన ఘటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన వార్తను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. అధికార పార్టీపై షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మీ ఇంటికి, మీ గ్రామానికి మేలు చేస్తేనే ఓటు వెయ్యండి అని అడిగేవాళ్లకు ఈ వార్త చూసైనా కనువిప్పు కలగాలి. ఆరోగ్యశ్రీని అట్టకెక్కించడంతో ఆసుపత్రిలో సరైన వైద్యం ఎలాగూ అందటంలేదు. కనీసం చనిపోయిన మృతదేహాన్ని కూడా ఇంటికి చేర్చుకోలేని దుస్థితిలో ప్రజలు ఉన్నారంటే అధికార పార్టీ సిగ్గుపడాలి. మేము అదిచేసాం ఇది చేశాం అని డబ్బాలు కొట్టుకోవటం కాదు. పేదోడి కనీస అవసరాలు తీర్చలేని మీ ప్రభుత్వం ఎందుకు? మళ్లీ మీరు రాజన్న వారసులం అని చెప్పుకుంటారు? ఇలానే ఉంటుందా రాజన్న పాలనా? అందుకే చెబుతున్నాం ఓటు అనే ఆయుధంతో వీళ్లకు బుద్ది చెప్పండి’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.