ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయం అంతా వలంటీర్ల చుట్టూనే తిరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ వలంటీర్ల వ్యవస్థపై టీడీపీ నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నెన్ని ఆరోపణలు, విమర్శలు చేసారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఎన్నికల టైమ్లో ఇదే వ్యవస్థపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. అధికారంలోకి రాగానే తొలి సంతకం వలంటీర్ల వ్యవస్థపైనే పెడతానని జగన్ చెబుతున్నారు. మరోవైపు.. కూటమి కూడా మాట మార్చి అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని.. ఉద్యోగులకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. అంతేకాదు.. వలంటీర్లకు భరోసా ఇవ్వడానికి వారి గౌరవ వేతనాన్ని 10 వేల రూపాయిలు చేస్తామని కూడా చంద్రబాబు ప్రకటించారు. వారికీ చివరికి ఎవరు న్యాయం చేస్తారో ఆలోచించుకోవలసిన సమయం ఆసన్నమైనది.