సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ వీడియోలో రెండు భిన్నమైన ఆడియోలో ఉండటాన్ని గమనించవచ్చు. మొదటి ఆడియోలో ‘టీడీపీ యువనేత నారా లోకేశ్ కారును పోలీసులు తనిఖీ చేశారు, ఉండవల్లి కరకట్ట సమీపంలో లోకేశ్ కాన్వాయ్ను ఆపి తనిఖీలు జరిపారు’ అంటూ న్యూస్ రీడర్ వార్త చదవడాన్ని గమనించవచ్చు. దీని ఆధారంగా ఈ వార్తలకు సంబంధించిన రిపోర్ట్స్ కోసం ‘ఫ్యాక్ట్ లీ’ యూట్యూబ్లో వెతకగా ఇదే ఆడియోతో ఉన్న లోకేశ్ కాన్వాయ్ చెకింగ్కు సంబంధించిన ఏబీఎన్ వార్తా కథనం లభ్యమైంది. ఈ కథనం ప్రకారం.. లోకేశ్ కాన్వాయ్ను పోలీసులు తనిఖీ చేశారు కానీ.. అందులో డబ్బులేమీ దొరకలేదు. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ చేసిన ట్వీట్లోనూ లోకేశ్ కాన్వాయ్లో డబ్బు దొరికిన ప్రస్తావన ఏమీ లేదు.
వైరల్ అవుతున్న వీడియోలోని రెండో ఆడియో కూడా యూట్యూబ్లో లభ్యమైంది. 2022 అక్టోబర్లో హైదరాబాద్లో రూ.8 కోట్ల హవాలా సొమ్మును పట్టుకున్న ఘటనకు సంబంధించి ఈటీవీ తెలంగాణ రిపోర్ట్ను ఫ్యాక్ లీ గుర్తించింది. వైరలవుతోన్న వీడియోలో ఉన్నట్టే ఈ కథనంలో న్యూస్ రీడర్ ‘సుమారు ఎనిమిది కోట్ల రూపాయలకుపైగా నగదు పట్టుబడింది’ అంటూ వార్తను చదివారు. దీన్ని బట్టి రెండు వేర్వేరు వార్తా కథనాల్లోని ఆడియోలను డిజిటల్గా మెర్జ్ చేసి నారా లోకేశ్ కాన్వాయ్లో డబ్బులు దొరికాయని ప్రచారం చేశారని అర్థమవుతోంది. లోకేశ్ కాన్వాయ్ చెకింగ్కు సంబంధించిన వార్తను చాలా మీడియా సంస్థలు కవర్ చేశాయి. కానీ ఏ మీడియా సంస్థ కూడా డబ్బు దొరికిందని రిపోర్ట్ చేయలేదు.
ఎన్నికల కోడ్ అమలులో భాగంగా పోలీసులు తన కాన్వాయ్ను తనిఖీ చేసి వెళ్లిపోయారని.. అయితే నోట్ల కట్టలు దొరికాయనేది తప్పుడు ప్రచారమని లోకేశ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తూ, ఫేక్ పోస్టులు వేస్తున్న వారిపై ఎన్నికల సంఘం, పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే.. లోకేశ్ కాన్వాయ్లో రూ.8 కోట్లు దొరికాయంటూ.. షేర్ చేస్తున్న వీడియో డిజిటల్గా ఎడిట్ చేసింది.