ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. కర్ణాటకలో బీజేపీకి.. హిమాచల్‌లో కాంగ్రెస్‌కు ఝలక్

national |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 10:20 PM

రాజ్యసభలో ఖాళీ కానున్న 56 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. అందులో 41 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మిగిలిన 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. ఈ 15 స్థానాలకు కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఎన్నికలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సందర్భంగానే పలు పార్టీలకు క్రాస్‌ ఓటింగ్‌ ప్రభావం చూపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చినట్లు సమాచారం. ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి అనుకూలంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఓటు వేయగా.. కర్ణాటకలో మాత్రం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.


ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్థానాలకు ఓటింగ్‌ జరిగింది. ఈ 10 స్థానాలకు బీజేపీ 8 మంది అభ్యర్థులను పోటీలో నిలిపింది. సమాజ్‌వాదీ పార్టీ ముగ్గురిని బరిలో ఉంచింది. అయితే యూపీలో ఏడుగురు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ.. అక్కడ బీజేపీకి అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ జరగడం పెను సంచలనంగా మారింది. హిమాచల్ ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలతోపాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి మద్దతుగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా పోటీలో ఉన్న అభిషేక్‌ మను సింఘ్వీకి నిరాశ తప్పలేదు.


 ఇక కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఓటు వేయడం సంచలంగా మారింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్‌ కూటమికి గట్టి షాక్ తగిలింది. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఎస్‌టీ సోమశేఖర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ మాకెన్‌కు ఓటేసినట్లు తెలుస్తోంది. మరో ఎమ్మెల్యే శివరాం హెబ్బర్‌ ఓటింగ్‌కు దూరంగా ఉండిపోవడం కూడా బీజేపీకి ఎదురుదెబ్బగా మారింది. దీంతో కాంగ్రెస్‌ 3 స్థానాల్లో విజయం ఖాయం కాగా.. బీజేపీకి ఒకచోట గెలిచే అవకాశం ఉంది.


కర్ణాటక బీజేపీపై గత కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్న ఈ ఇద్దరు రెబల్‌ ఎమ్మెల్యేలు ఎస్‌టీ సోమశేఖర్, శివరాం హెబ్బర్.. గత కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీతో సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ నేపథ్యంలో ఎస్‌టీ సోమశేఖర్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకునే అంశంపై స్పీకర్‌తో మాట్లాడతామని విపక్ష నేత, కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి ఆర్‌ అశోకా తెలిపారు. ఓటింగ్‌ అనంతరం విలేకర్లతో మాట్లాడిన ఎస్‌టీ సోమశేఖర్‌.. ఈ రాజ్యసభ ఎన్నికల్లో తన మనస్సాక్షికి అనుగుణంగానే ఓటు వేశానని చెప్పడం మరిన్ని ఊహాగానాలకు దారి తీస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com