ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ-జనసేన పొత్తులో కీలక పరిణామం.. రేపే మొదటి విడత అభ్యర్థుల జాబితా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 11:21 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు.. ఉమ్మడి కార్యాచరణ, పొత్తుల సంగతి తేల్చేందుకు సిద్ధమయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే ఇప్పటికే ఎవరికి వారు ప్రచారం ముమ్మరం చేసిన ఇరు పార్టీలు.. ఇక అభ్యర్థుల ఎంపిక, ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు విడిగా అమరావతికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను విడుదల చేస్తారు అనే ప్రచారం జోరందుకుంది. మరోవైపు.. ఈ రెండు పార్టీలు కలిసి ఈ నెల 28 వ తేదీన తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, ఉమ్మడి కార్యాచరణను వేగవంతం చేసేందుకు తెలుగుదేశం-జనసేన పార్టీలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ హైదరాబాద్‌ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. ఇక అదే సమయంలో పవన్‌ కల్యాణ్‌ కూడా విడిగా అమరావతికి చేరుకున్నారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటనపై ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శనివారం కూటమి మొదటి జాబితాను ప్రకటించే అవకాశముందని ఆంధ్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు తెలుగుదేశం గానీ, జనసేన గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.


మరోవైపు.. తెలుగుదేశం-జనసేన కూటమిలో బీజేపీని కూడా కలుపుకోవడంతో చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. అందువల్లనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితా ఇంకా సిద్ధం కాలేదని సమాచారం. బీజేపీతో సంప్రదింపులు పూర్తయ్యేలోపు మొదటి జాబితాను విడుదల చేస్తే.. కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఇక ఈ నెల 28 వ తేదీన తాడేపల్లిగూడెం వేదికగా తెలుగుదేశం-జనసేన భారీ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. అయితే అప్పటిలోగా బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశముందని ఇరు పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు.


శనివారం పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు నేతలంతా అందుబాటులో ఉండాలని కీలక నేతలకు తెలుగుదేశం జాతీయ కార్యాలయం నుంచి సమాచారం వెళ్లింది. అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, రామానాయుడు సహా ముఖ్య నేతలకు చంద్రబాబు ఫోన్‌ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనపై చర్చించి.. ఈ సమావేశం తర్వాత కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుగుదేశం వర్గాలు చర్చించుకుంటున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com