ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీ బిల్డింగ్‌కి వాస్తుదోషం ఉంటే.. రోడ్డు మూసేస్తారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 10, 2023, 08:46 PM

విశాఖపట్నంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జనసేన నేతలు, కార్యకర్తల నిరసనకు తోడు పోలీసుల చర్యలతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని టైకూన్ కూడలి వద్ద ఉన్న రోడ్డును అధికారులు మూసేశారు. అయితే ఎంపీ బిల్డింగే కారణమంటూ జనసేన శ్రేణులు ఆందోళనకు దిగాయి. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న భవనానికి వాస్తుదోషం ఉందనే.. ఈ రోడ్డును మూసేశారని జనసేన నేతలు ఆందోళనకు దిగారు. తమ నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వారిని విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


ఈ విషయం తెలుసుకున్న జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. వెంటనే అక్కడకు చేరుకున్నారు. విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన నాదెండ్ల మనోహర్.. పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన నాయకులను రోడ్డుపై ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడం పైశాచిక చర్య అని మండిపడ్డారు.ప్రజా సమస్యలపై నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు లేదా అంటూ ప్రశ్నించారు. ప్రజాసమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడం ప్రతిపక్షాలుగా తమ బాధ్యతన్న నాదెండ్ల మనోహర్.. ఏం తప్పు చేశారని జనసేన నేతలను అరెస్ట్ చేశారని నిలదీశారు. పై నుంచి వస్తున్న ఒత్తిళ్లవల్లనే పోలీసులు ఈ తీరుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టైకూన్ కూడలి వద్ద రోడ్డు మూసివేతతో ఎవరికి ప్రయోజనం కలుగుతోందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విశాఖలో జరిగిన భూదందాలపై టీడీపీ, జనసేన ప్రభుత్వంలో దర్యాప్తు జరుపుతామని స్పష్టం చేశారు.


మరోవైపు.. వారాహి విజయయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ వైజాగ్ వచ్చిన సమయంలో.. టైకూన్ కూడలి నుంచి వీఐపీ రోడ్డుకు వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారని స్థానికులు జనసేనాని దృష్టికి తెచ్చారు. దీనివల్ల రెండు కిలోమీటర్ల దూరం తగ్గుతుందని పవన్ కళ్యాణ్‌కు వివరించారు. దీంతో సమస్యను పరిష్కరించాలంటూ జనసేనాని కూడా అధికారులకు విజ్ఞప్తిచేశారు. అయితే ఇప్పటికీ ఆ సమస్య అలాగే కొనసాగుతుండటంతో జనసేన శ్రేణులు మరోసారి ఆందోళనకు దిగాయి. వెంటనే రోడ్డును తెరవాలంటూ శనివారం నిరసన కార్యక్రమం చేపట్టాయి. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించాల్సి వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com