ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోరం.. 24 గంటల వ్యవధిలో ఆస్పత్రిలో 9 మంది శిశువుల మృతి

national |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 09:41 PM

పశ్చిమ బెంగాల్‌లోని ఓ ఆస్పత్రిలో వరుసగా చిన్నారులు మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. 24 గంటల వ్యవధిలోనే 9 మంది అప్పుడే పుట్టిన శిశువులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ 9 మంది నవజాత శిశువులతోపాటు మరో 2 ఏళ్ల చిన్నారి కూడా చనిపోవడం తెగ సంచలనంగా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కార్.. ఈ మరణాలకు గల కారణాలను గుర్తించేందుకు హుటాహుటిన ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది.


అయితే ప్రాథమికంగా వస్తున్న నివేదికల ప్రకారం.. ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ చనిపోయిన ఆ చిన్నారులంతా పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఆ శిశువులు అతి తక్కువ బరువు ఉన్నారని.. అందులో ఒకరు తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే అక్కడ చనిపోయిన 9 మంది శిశువుల్లో ముగ్గురు ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీలో పుట్టారని.. మిగిలిన వారు ఆ ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఆస్పత్రుల్లో జన్మించారని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ వర్గాలు వెల్లడించాయి. వివిధ ఆస్పత్రుల్లో జన్మించిన ఆ శిశువుల ఆరోగ్యం క్షీణించి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్‌కు తరలించినట్లు తెలిపారు. అయితే ఆ శిశువులకు చికిత్స అందించేందుకు కొంత సమయం కావాల్సి ఉండేదని.. అయితే అప్పటికే వారు ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకురావడంతో వారి ప్రాణాలను రక్షించలేకపోయామని ఉన్నతాధికారులు వెల్లడించారు.


జాంగిపుర్ సబ్‌ డివిజినల్ ఆస్పత్రిలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చే శిశువుల కేసులను ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీకి రెఫర్ చేస్తున్నట్లు వైద్య అధికారులు మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలోనే గత 30 రోజుల వ్యవధిలో మొత్తం 380 మంది శిశువులను మెరుగైన వైద్య చికిత్స కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముర్షిదాబాద్ మెడికల్ హాస్పిటల్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి నివేదికను వైద్యశాఖ ఉన్నతాధికారులకు పంపినట్లు తెలుస్తోంది. ఇక అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందారన్న వార్తలు స్థానికంగా తీవ్ర ఆందోళనలకు కారణం అయ్యాయి. ఈ ఘటనతో ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్న పిల్లల ఆరోగ్య పరిస్థితి పట్ల వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com