ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు షాక్.. లోక్‌సభ నుంచి బహిష్కరిస్తూ వేటు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 09:40 PM

పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపార వేత్త నుంచి డబ్బులు, బహుమతులు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో విచారణ జరిపి ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలిపిన లోక్‌సభ.. ఆమెను సభ నుంచి బహిష్కరిస్తూ వేటు వేసింది. ఎంపీ మహువా మొయిత్రా అనైతికంగా, అమర్యాదకరంగా ప్రవర్తించారని ఎథిక్స్ కమిటీ చేసిన తీర్మానాన్ని లోక్‌సభ అంగీకరించింది. మహువా మొయిత్రా ఇక ఎంపీగా కొనసాగడం తగదని స్పీకర్‌ ఓం బిర్లా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. మహువా మొయిత్రాను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.


మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పార్లమెంటు ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికను శుక్రవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీని తర్వాత మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తీర్మానం ప్రవేశ పెట్టారు. అయితే మహువా మొయిత్రాపై ప్రహ్లాద్ జోషీ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పార్లమెంటు ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేసేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని పేర్కొన్నాయి. నివేదికపై ఓటింగ్‌కు ముందు దానిపై సభలో చర్చ జరపాలని టీఎంసీ సహా మిగితా ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు.


దీంతో ఎథిక్స్ కమిటీ నివేదికపై చర్చించేందుకు స్పీకర్‌ ఓం బిర్లా కొద్దిసేపు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీ చర్చ కొనసాగింది. ఈ చర్చలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని మహువా మొయిత్రా చేసిన విజ్ఞప్తిని స్పీకర్ ఓం బిర్లా నిరాకరించారు. ఆ తర్వాత మూజువాణీ ఓటింగ్‌ ద్వారా.. ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్‌సభ ఆమోదించింది. అనంతరం మహువా మొయిత్రాను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్‌ ఓం బిర్లా.. సభను డిసెంబరు 11 వ తేదీకి వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఓటింగ్‌ సమయంలో ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్‌ చేశాయి.


అయితే తనను లోక్‌సభ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మహువా మొయిత్రా తీవ్రంగా వ్యతిరేకించారు. పార్లమెంటు ఎథిక్స్‌ కమిటీ అన్ని నిబంధనలను ఉల్లంఘించిందని.. ఆమె ఆరోపించారు. తమను అణగదొక్కేందుకు ఎథిక్స్ కమిటీని ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఇద్దరు వ్యక్తులు చెప్పిన వ్యాఖ్యలను నమ్మి తనను దోషిగా తేల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక త్వరలోనే తమ ఇంటికి సీబీఐని పంపించి తనను వేధిస్తారేమో అని మహువా మొయిత్రా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు బిజినెస్‌మెన్ హీరానందాని నుంచి మహువా మొయిత్రా డబ్బు, ఖరీదైన బహుమతులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు ఆమె తన పార్లమెంట్ లాగిన్‌ వివరాలను దుబాయ్‌ నుంచి ఓపెన్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పార్లమెంట్ ఎథిక్స్‌ కమిటీ.. మహువా మొయిత్రాతో పాటు ఆమెపై ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దుబే, లాయర్ జై అనంత్‌ దెహద్రాయ్‌ని విచారణ జరిపింది. ఆ తర్వాత 500 పేజీలతో కూడిన నివేదికను రూపొందించింది. మహువా ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని ఎథిక్స్‌ కమిటీ గుర్తించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com