ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రైతులకు సంక్రాంతిలోగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 06:42 PM

మిచౌంగ్ తుపానుతో పంట నష్టపోయిన ప్రాంతాలలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. బాపట్ల జిల్లా పాతనందాయపాలెం, కర్లపాలెం ప్రాంతాలలో పర్యటించిన జగన్.. పంటనష్టాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తుపాను వల్ల నష్టపోయిన వారిని అన్ని విధాల ఆదుకుంటామన్న సీఎం.. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. బాధితులను గుర్తించి పారదర్శకంగా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. దాదాపుగా 12 వేల మంది తుపాన్‌ కారణంగా నష్టపోయారన్న జగన్ .. ప్రతి ఇంటికీ రేషన్‌ సరుకులతో పాటుగా 2500 రూపాయల నగదును అందిస్తున్నట్లు చెప్పారు.


ఇదే సమయంలో గత టీడీపీ ప్రభుత్వంపై వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వంలో కరువు వచ్చినా, వరద వచ్చినా పట్టించుకోలేదని విమర్శించారు. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో మొత్తం మార్చేశామన్న సీఎం..తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ప్రతి ఎకరాను కూడా ఈ–క్రాప్‌ చేసి.. నష్టపోయిన ప్రతి రైతుకూ ఇన్సూరెన్స్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీదని జగన్ తెలిపారు. గత ప్రభుత్వంలో కేవలం 34 లక్షల మందికి మాత్రమే ఇన్సూరెన్స్‌ ఇచ్చారన్న ఏపీ సీఎం.. వైసీపీ పాలనలో 55 లక్షల మందికి రూ.7800 కోట్లు ఇన్సూరెన్స్ కింద చెల్లించినట్లు వివరించారుఏ సీజన్‌కు సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీనీ ఆ సీజన్‍‌లోనే ఇస్తున్నామన్న జగన్..గ్రామ సచివాలయాల్లో జాబితాను ప్రదర్శించి, మిస్‌ అయిన రైతులు మళ్లీ నమోదు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే ఏపీలోని రైతులకు జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. వచ్చే నెల సంక్రాంతిలోగా రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేస్తామని తెలిపారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు ఇస్తామని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దన్న సీఎం జగన్.. వైసీపీ పాలనలో పనులన్నీ పారదర్శకంగా జరుగుతాయనీ హమీ ఇచ్చారు. రోడ్లు, వాటర్‌ ట్యాంకులకు త్వరలోనే మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేయిస్తామనీ.. శాశ్వతంగా చేయాల్సిన పనులు కూడా వీలైనంత త్వరగా చేస్తానని సీఎం వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com