ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూకే వెళ్లేవారికి షాకిచ్చిన రిషి సునాక్.. వీసాలపై సంచలన నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 10:47 PM

స్వదేశీయులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో అధిక ప్రాధాన్యం కల్పించేలా.. విదేశీ నిపుణుల వీసాల జారీ విషయంలో యూకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వలసలను తగ్గించేలా రిషి సునాక్ సర్కారు ‘రాడికల్ యాక్షన్’ ప్రకటించింది. వలసదారులను తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేసిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై టోరీ ఎంపీల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం దాదాపు 3 లక్షల మంది వలసదారులపై ప్రభావం చూపుతుందని యూకే హోమ్ శాఖ కార్యాలయం పేర్కొంది. కొత్త చర్యల ఆధారంగా వారు యూకేలోకి ప్రవేశించడానికి అనర్హులవుతారని, ఇందులో నైపుణ్యం కలిగిన విదేశీయులకు కనీస వేతనం మూడో వంతు పెరుగుతాయని పేర్కొంది.


2022లో యూకే ప్రభుత్వం 7,45,000 వీసాలను జారీచేయగా.. ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యధికం కావడం గమనార్హం. వీటి సంఖ్యను మూడు లక్షల కంటే తక్కువకు తీసుకురావాలనుకునే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని హోమ్ మంత్రి జేమ్స్ క్లెవెర్లీ వెల్లడించారు. వలసలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆమె గణాంకాలతో సహా వెల్లడించారు. ఇమ్మిగ్రేషన్ చాలా ఎక్కువగా ఉందని, వాటిని తగ్గించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాని, ఇవి యూకే ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఉంటాయని రిషి సునాక్ ట్విట్టర్‌లో స్పష్టం చేశారు.


అంతేకాదు, విదేశీ విద్యార్థులు తమ వెంట కుటుంబసభ్యులను తీసుకురావడంపై కూడా నిషేధం ఉంది. అయితే, రిసెర్చ్ డిగ్రీలు చేసే పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే, విదేశీ నిపుణుల వేతనం కూడా 26,200 పౌండ్ల నుంచి 38,700 పౌండ్‌లకు (రూ.40,01,932) పెంచింది. దీనివల్ల విదేశీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులను స్పాన్సర్ చేసే బ్రిటీష్ లేదా స్థిరపడిన వ్యక్తులకు కనీస వేతనాలు గణనీయంగా పెరగనున్నాయి. గతంలో ఐరోపా సమాఖ్య దేశాల నుంచే ఎక్కువగా బ్రిటన్‌కు వలసలు వచ్చేవారు. అయితే ఈ మధ్యకాలంలో భారత్, నైజీరియా, చైనా నుంచి అక్కడకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కేర్ క్వాలిటీ కమిషన్ పర్యవేక్షణలోని కార్యకలాపాలకు సంబంధించి మాత్రమే వారు ఇతరులకు వీసాను స్పాన్సర్ చేయగలరు. తాజా నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత వలసలు భారీగా తగ్గే అవకాశం ఉందని సమాచారం. ఈ మార్పులు సెప్టెంబర్ 2023తో ముగిసే సంవత్సరంలో స్పాన్సర్ చేసిన విద్యార్థులపై ఆధారపడిన వారికి సుమారు 153,000 వీసాలు మంజూరు చేయడంతో నికర వలసలను గణనీయంగా ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు. ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com