ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పునాదులతో సహా పార్లమెంట్‌ను కూల్చేస్తా: మరోసారి ఖలీస్థాన్ ఉగ్రవాది పన్నూ బెదిరింపులు

national |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 10:31 PM

ఖలీస్థాన్ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి రెచ్చిపోయాడు. 2001 దాడి వార్షికోత్సవం డిసెంబరు 13న లేదా అంతకు ముందే పునాదులతో సహా పార్లమెంట్‌ను కూల్చివేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. తన హత్యకు కుట్రలు చేసిన భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని బెదిరించాడు. ఈ మేరకు 2013లో ఉరితీయబడిన పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురు ఫోటోతో పాటు ‘ఢిల్లీ బనేగా ఖలిస్థాన్’ (ఢిల్లీలో ఖలీస్థాన్ ఏర్పడుతుంది) అనే శీర్షికతో ఒక పోస్టర్‌ ఉన్న వీడియోను విడుదల చేశాడు.


దీంతో ఎస్ఎఫ్‌జే మద్దతుదారులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా భద్రతా బలగాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచుతున్నారు. కాగా, భారత సంతతికి చెందిన పన్నూ హత్య కుట్రలను జూన్‌లో భగ్నం చేసినట్టు అమెరికా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా అభ్యర్థన మేరకు జూన్ 30న ప్రేగ్ విమానాశ్రయంలో నిఖిల్ గుప్తా అనే భారత సంతతికి చెందిన డ్రగ్స్ వ్యాపారిని చెక్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.


అండర్‌కవర్ పోలీసుతో కలిసి పనిచేశాడని, పన్నూను చంపడానికి డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీకి ఇన్‌ఫార్మర్‌ను నియమించాడని ఆరోపించింది. న్యూయార్క్ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయడానికి ముందు నవంబర్ మొదటి వారంలో గుప్తాను అమెరికా అధికారులకు అప్పగించారు. ఈ పరిణామాలతో అమెరికా భారత రాయబారి తరన్‌జిత్ సింద్ సంధూను గురుద్వారాలో ఖలీస్థాన్ సానుభూతిపరులు అడ్డుకుని, పన్నూ హత్యకు కుట్రలు చేశారని దాడికి ప్రయత్నించారు.


రెండు నెలల కిందట యూకేలోని భారత రాయబారి విక్రమ్ దొరైస్వామికి ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. స్కాట్లాండ్ గురుద్వారాలోకి దొరైస్వామి వెళ్తుండగా ఖలీస్థానీ మద్దతుదారులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. పన్నూ గత రెండేళ్లుగా భారత్‌‌‌ వ్యతిరేక చర్యలను వేగవంతం చేశాడు. గత ఏడాది కాలంగా కెనడా, యూకేలోని భారతీయ మిషన్లు, అధికారులపై ఖలిస్థాన్ మద్దతుదారులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఒట్టావా, ఇతర ప్రాంతాలలో ఉన్న మిషన్‌లోని టాప్ దౌత్యవేత్తల పేర్లతో పన్నున్ 'కిల్ పోస్టర్'లను కూడా విడుదల చేశాడు. ఢిల్లీ విమానాశ్రయంలో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు రాయమని పన్నూన్ తమను ఆదేశించినట్లు ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఎస్‌ఎఫ్‌జే కార్యకర్త వెల్లడించాడు. 1985లో జరిగిన కనిష్క బాంబు దాడిని పునరావృతం చేస్తానని బెదిరించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com