ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలోని మెజార్టీ హత్యల వెనుక ప్రధాన ఉద్దేశాలివే.. కేంద్రం సంచలన నివేదిక

national |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 10:27 PM

దేశంలో జరుగుతున్న హత్యల వెనుక అత్యంత సాధారణ కారణాలను నేషనల్ క్రైమ్ రికార్స్ బ్యూరో (ఎన్‌సీఆర్బీ) తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది దేశంలో 28,522 హత్య కేసులు నమోదుకాగా.. రోజువారీ సగటు 78గా ఉందని తెలిపింది. అయితే, 2020,2021 సంవత్సరాలతో పోల్చితే హత్య కేసులు తగ్గడం కాస్త ఊరట కలిగించే అంశం. క్రైమ్ ఇన్ ఇండియా 2022 నివేదిక ప్రకారం.. 2021లో 29,272, 2020లో 29,193 కేసులు నమోదయ్యాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్‌ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. గతేడాది అక్కడ 3,491 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుకాగా.. తర్వాతి బిహార్ (2,930), మహారాష్ట్ర (2,295), మధ్యప్రదేశ్ (1,978), రాజస్థాన్ (1,834), పశ్చిమ్ బెంగాల్ (1,696) నిలిచాయి.


అత్యల్పంగా సిక్కిమ్‌లో 9, నాగాలాండ్ 21, మిజోరాం 31, గోవా 44, మణిపూర్‌లో 47 కేసులు నమోదయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతాల విషయానికి వస్తే ఢిల్లీలో 509 హత్య కేసులు నమోదుకాగా.. జమ్మూ కశ్మీర్ (99), పుదుచ్చేరి (30), చండీగఢ్ (18), దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ (16), అండమాన్ నికోబార్ దీవులు (7), లడఖ్ (5), లక్షద్వీప్ (0)గా ఉన్నాయి. హత్యకు గురైనవారిలో 95.4 శాతం మంది 20 దాటిన పెద్దవాళ్లే. మొత్తం బాధితుల్లో 8,125 మంది మహిళలు కాగా, పురుషులు 70 శాతం మంది ఉన్నారు. గతేడాది హత్యకు గురైన వారిలో తొమ్మిది మంది థర్డ్ జెండర్లు కూడా ఉన్నారు. 2022లో అత్యధిక హత్య కేసుల్లో 9,962 కేసులతో 'వివాదాలే' కారణమని డేటా వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 1,130 కేసులు కాగా.. తర్వాతి తమిళనాడు (1,045), బీహార్ (980), మధ్యప్రదేశ్ (726), ఉత్తరప్రదేశ్ (710) వివాదాల కేసులు నమోదయ్యాయి.


గతేడాది వివాదాల తర్వాత ‘వ్యక్తిగత పగ లేదా శత్రుత్వం’ కారణంగా జరిగిన హత్య కేసులు ( 3,761) ఉన్నాయి. ఈ జాబితాలో బీహార్ (804), మధ్యప్రదేశ్ (364), కర్ణాటక (353) అగ్రస్థానంలో నిలిచాయి. NCRB డేటా ప్రకారం వరకట్నం, క్షుద్రపూజలు, నరబలి మత, కులతత్వం, రాజకీయ కారణాలు, వర్గ వైరుధ్యం, పరువు హత్య, ప్రేమ వ్యవహారాలు ఇతర ఉద్దేశాలు ఉన్నాయి. కుటుంబ వివాదాలు, అక్రమ సంబంధాలు, తీవ్రవాదం/ తిరుగుబాటు, దోపిడీలు, ముఠా వైరం, ఆస్తి/ భూమి తగాదాలు, చిన్న చిన్న తగాదాలు కూడా 2022లో హత్యలకు కారణమయ్యాయి. ప్రధాన నగరాల విషయానికి వస్తే అత్యధిక హత్యలతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత ముంబయి ఉన్నాయి. సురక్షిత నగరాల్లో కోల్‌కతా, పుణే, హైదరాబాద్ నిలిచాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com