ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి శుభవార్త.. హమ్మయ్యా టెన్షన్ అవసరం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 08:58 PM

ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అదనంగా ఒక రోజు పొడిగించింది. సాధారణంగా ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ఈ నెల 6 వరకు పొడిగించింది. వాలంటీర్లు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యల్లో ఉన్నారు.ఈ కారణంగా ప్రభుత్వం పింఛన్ల పంపిణీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలకు సంబంధించి ప్రభుత్వం 65,33,781 మంది లబ్ధిదారుల కోసం రూ.1,800.96 కోట్లను విడుదల చేయగా.. ఐదో తేదీ సాయంత్రానికే 64,62,991 మంది లబ్ధిదారులకు రూ.1,781.37 కోట్ల పంపిణీ పూర్తయ్యింది. రా­ష్ట్రంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ మంగళవారం కూడా 81,702 మందికి పైగా లబ్ధిదారులకు వలంటీర్లు పింఛన్‌ డబ్బులు పంపిణీ చేశారు. మిగిలిన వారికి ఇవాళ పంపిణీ చేయనున్నారు. పింఛన్లు అందని వారు టెన్షన్ పడొద్దని సూచించారు అధికారులు.


మరోవైపు తుఫాన్ బాధితులకు రేషన్‌ పంపిణీని గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థల ద్వారా సమర్థవంతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తుఫాన్ బాధిత ప్రాంతాల్లో సహాయ కార్య­క్రమాలపై సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి. సాయిప్రసాద్, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో జగన్‌తో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తుఫాన్ పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామన్నారు. బాధితులకు మంచి సదుపాయాలు అందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని సూించారు.నెల్లూరు, తిరుపతి సహా తుఫాన్ కారణంగా దెబ్బ­తిన్న ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన కరెంటు సరఫరా వ్యవస్థను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాణ, పశు నష్టం జరిగినట్లు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. అలాగే వెంటనే ఎన్యూమరేషన్‌ కూడా ప్రారంభం కావాలన్నారు.


తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్ల నుంచి అధికార యంత్రాంగం అంతా క్షేత్రస్థాయికి వెళ్లింది. దగ్గరుండి సహాయక చర్యలను చేపట్టింది. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు కల్లాల్లో ధాన్యం గుట్టలను సందర్శించి అవి తడవకుండా టార్పాలిన్లు కప్పేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాదు ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధైర్యపడాల్సిన అవసరంలేదని, మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, అధికారులు భరోసా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com