ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌లో ఉగ్రవాద ముఠాల మధ్య ఆధిపత్య పోరు,,,ఉగ్రవాదిని హత్యచేసిన గుర్తుతెలియని వ్యక్తులు

international |  Suryaa Desk  | Published : Mon, Oct 02, 2023, 09:45 PM

లష్కరే తొయిబా కీలక నేత, ఉగ్రవాది ముఫ్లీ కైజర్ ఫరూఖ్‌‌ను కరాచీలో గుర్తుతెలియని వ్యక్తి కాల్చి చంపినట్టు పాకిస్థాన్ మీడియా తెలిపింది. ముంబయి మారణహోమం సూత్రధారి, లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఫరూఖ్ ప్రధాన అనుచరుడు. శనివారం సమానాబాద్ ప్రాంతంలోని ప్రార్థనా స్థలం సమీపంలో 30 ఏళ్ల కైజర్ ఫరూఖ్‌‌పై గుర్తుతెలియని వ్యక్తి తుపాకితో దాడిచేసినట్టు పాక్ పత్రిక డాన్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఫరూఖ్‌ను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించినట్టు వివరించింది. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు వెల్లడించింది.


ఘటనలో నిందితులు వెనుక నుంచి కాల్పులు జరిపారని... ఫరూఖ్‌కి వీపులోకి బుల్లెట్లు దూసుకెళ్లాయని చెప్పింది. కాల్పులు జరిపిన సమయంలో రికార్డయిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఫరూఖ్ హత్యకు.. గత నెల ప్రారంభంలో ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాతో సంబంధాలు ఉన్న పాక్ మత గురువు హత్యకు దగ్గర పోలికలు ఉన్నాయి. మతపెద్ద మౌలానా జియావుర్ రెహ్మాన్.. కరాచీలో సాయంత్రం షికారు చేస్తున్న సమయంలో ఇద్దరు మోటారు సైకిల్‌పై వచ్చిన ముష్కరులు అతడిపై కాల్పులు జరిపారు.


ఈ రెండు హత్యలపై పాక్ దర్యాప్తు ఏజెన్సీల విచారణ చేపట్టాయి. కాగా, పాక్‌లో ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక నేతలు అనూహ్యంగా హతమవుతోన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు సయ్యద్ సలావుద్దీన్ సన్నిహితుడు బష్ర్ పీర్ రావల్పిండిలో హత్యకు గురయ్యాడు. బష్ర్ పీర్ దుకాణం వెలుపల నిలబడి ఉన్న అతడిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. దగ్గరి నుంచి కాల్పులు జరపడంతో పీర్ అక్కడికక్కడే చనిపోయాడు.


కాగా, ఈ హత్యలు పాకిస్థాన్‌లో భద్రతా బలగాలకు తలనొప్పిగా మారుతున్నాయి. పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ఆస్తులను కూడా టార్గెట్ చేయడంతో.. వాటిని రక్షించుకోడానికి నానా తంటాలు పడుతోంది. సెప్టెంబరులో రావల్‌కోట్‌లో అబూ ఖాసిమ్ కశ్మీరీ, నజీమాబాద్‌లో ఖరీ ఖుర్రం షెహజాద్ అనే ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హత్యల తర్వాత ఆస్తులను సురక్షితంగా ఉంచాల్సిన ఆవశ్యకతను ఐఎస్ఐ భావించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సెప్టెంబరు 12న రెహమాన్ హత్యకు గురికాగా.. ఘటనా స్థలిలో స్థానిక పోలీసులు 11 కాట్రిడ్జ్‌లను కనుగొన్నారు. వాటిలో కొన్ని 9ఎంఎం క్యాలిబర్‌కు చెందినవి.


ఈ హత్యను ఉగ్రవాద దాడిగా పాక్ పోలీసులు అభివర్ణించారు. ఇది పాక్‌ సొంత ఉగ్రవాదుల పాత్రను సూచిస్తుంది. ఉగ్రవాద సంస్థల మధ్య ఆధిపత్య పోరు హత్యకు గల కారణమనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రెహ్మాన్ హత్య కరాచీలో మత బోధకులపై వరుస దాడులకు నిదర్శనం. వీరంతా ఐఎస్‌ఐ పెంచి పోషిస్తోన్న తీవ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్న వ్యక్తులే. యువకులను ఉగ్రవాదంలోకి ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com