ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేనకా గాంధీపై ,,,,రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఇస్కాన్

national |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2023, 07:56 PM

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుత ఎంపీ మేనకా గాంధీకి పెద్ద షాక్ తగిలింది. ఇస్కాన్‌పై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆ సంస్థ స్పందించింది. ఈ వ్యాఖ్యలు తీవ్ర దురదృష్టకరమని పేర్కొంది. ఇస్కాన్‌పై ఇలాంటి ఆరోపణలు చేసిన మేనకా గాంధీపై ఇస్కాన్ సంస్థ రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఈ మేరకు పరువు నష్టం నోటీసులు కూడా జారీ అయ్యాయి. దీనికి సంబంధించిన న్యాయ ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు ఇస్కాన్ సంస్థ వెల్లడించింది.


ఇస్కాన్‌పై మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలపై కోల్‌క‌తాలోని ఇస్కాన్ ఉపాధ్య‌క్షుడు రాధా ర‌మ‌ణ్ దాస్ తాజాగా స్పందించారు. మేన‌కా గాంధీ వ్యాఖ్య‌లు చాలా దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని.. ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ భ‌క్తుల్ని బాధించేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. మేనకా గాంధీపై రూ. 100 కోట్ల ప‌రువు న‌ష్టం కేసు వేసేందుకు అవసరమైన న్యాయ ప్ర‌క్రియను ఇప్పటికే మొదలు పెట్టామని.. దీనికి సంబంధించి ఆమెకు నోటీసులు కూడా జారీ చేసినట్లు రాధా రమణ్ దాస్ వెల్లడించారు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అయిన మేనకా గాంధీ.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంత పెద్ద సంస్థ‌ అయిన ఇస్కాన్‌పై ఎలా ఆరోప‌ణ‌లు చేశార‌ని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే మేనకా గాంధీ చేసిన ఆరోపణలను ఇస్కాన్ జాతీయ ప్ర‌తినిధి యుదిష్ట‌ర్ గోవింద దాస్‌ ఖండించారు. ఆమె చేసిన ఆరోప‌ణ‌లు నిరాధార‌మైన‌వ‌ని.. త‌ప్పుడువ‌ని ఆయన పేర్కొన్న‌ారు. గోవులు, ఆవుల సంర‌క్ష‌ణ‌కు ఇస్కాన్ అధిక ప్రాధాన్య‌త ఇస్తుందని స్పష్టం చేశారు. భారత్‌లోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇస్కాన్ సంస్థ గోవుల్ని ఆద‌రిస్తున్న‌ట్లు చెప్పారు.


ఇటీవల ఇస్కాన్‌పై మేనకా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన కృష్ణుడి శాఖ అయిన ఇస్కాన్‌పై.. జంతువుల హక్కుల కార్యకర్త అయిన మేనకా గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్కాన్ దేశంలోనే అతిపెద్ద మోసపూరితమైన సంస్థ అని.. గోశాలలు ఏర్పాటు చేసేందుకు స్థలం, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి లబ్ది పొందుతోందని ఆరోపించారు. గోశాలల నిర్వహణ పేరిట ఆవుల్ని కబేళాలలకు అమ్ముకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ పర్యటనను మేనకా గాంధీ గుర్తు చేసుకున్నారు. అనంతపురం ఇస్కాన్ గోశాలలో పాలిచ్చే ఆవులు లేనే లేవన్నారు. అలాంటి వాళ్లు రోడ్లపైకి చేరి హరేరామ్‌.. హరేకృష్ణ అంటూ కీర్తనలు చేస్తూ ఉంటారని వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com