ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమిలీ ఎన్నికలు లేనట్లేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు

national |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2023, 07:55 PM

జమిలీ ఎన్నికలు. ప్రస్తుతం దేశం మొత్తం తీవ్ర చర్చ జరుగుతున్న అంశం. అయితే ఇప్పటికిప్పుడు దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో అనుమానం తలెత్తింది. ఈ క్రమంలోనే ఒకే దేశం ఒకే ఎన్నికపై కసరత్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని కూడా నియమించడం.. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని చెప్పడంతో జమిలీ ఎన్నికలు కేంద్రం నిర్వహించనుందనే ఊహాగానాలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలోనే లా కమిషన్ నుంచి సరికొత్త అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జమిలీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో 2029 లో జరిగే సార్వత్రిక ఎన్నికల వరకు ఈ జమిలీ ఎన్నికలను నిర్వహించేలా కొత్త ఫార్ములాను రూపొందించేందుకు విస్తృత అధ్యయనం చేస్తోంది. అందు కోసం కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలాన్ని తగ్గించడం, మరికొన్ని శాసనసభల పదవీ కాలాలను పెంచడం చేయనున్నట్లు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలోనే లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు మొత్తానికి ఒకే రకమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు లా కమిషన్‌ ఓ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఖర్చు, ఎన్నికల నిర్వహణకు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను కూడా భారీగా తగ్గించుకోవచ్చని లా కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు ఈ జాబితాను తయారు చేస్తున్నాయి. అయితే ఇలాంటి విషయాలన్నీ బయటకు వచ్చినా.. వాటి అమలుకు మరిన్ని సమస్యలు ఉత్పన్నం కావడంతో లా కమిషన్‌ తుది నివేదిక సిద్ధం చేయలేదని తెలుస్తోంది. అయితే జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై కసరత్తు కొనసాగుతోందని లా కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ రితు రాజ్‌ అవస్తీ ఇటీవల తెలిపారు.


లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే ఈ జమిలీ ఎన్నికలు లేదా ఒకే దేశం ఒకే ఎన్నిక. అయితే ఇది 2014 లో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అడపాదడపా వార్తల్లో వినిపిస్తున్నప్పటికీ.. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల ఈ జమిలీ ఎన్నికలపై కసరత్తు చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని వేయడం.. ఆ వెంటనే సభ్యులను నియమించి.. వేగంగా పని పూర్తి చేసి నివేదిక సమర్పించాలని చెప్పడంతో ఇక ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ, ఇతర శాసనసభ ఎన్నికలు ఉండటంతో అన్నీ కలిపి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. అయితే ఆ కమిటీ ఇటీవలె తొలి సమావేశం కూడా నిర్వహించింది. దేశంలో గ్రామ పంచాయతీల నుంచి లోక్‌సభ వరకు అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించింది.


అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు పిలుపునివ్వడంతో ఇక ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహిస్తారన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే మరోసారి జమిలీ ఎన్నికల అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అయితే ఈ ప్రత్యేక సమావేశాల్లో ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎలాంటి ప్రస్తావన తీసుకురాకపోవడం గమనార్హం. అయితే తాజాగా లా కమిషన్ చేస్తున్న కసరత్తులతో ఈసారి జమిలీ ఎన్నికలు ఉండవని తెలుస్తోంది. అయితే ఈ జమిలీ ఎన్నికల కోసం కొత్త ఫార్ములా కోసం లా కమిషన్ తీవ్ర కసరత్తు చేస్తోందని.. అయితే 2029 నుంచి జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com