ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ పాత్రపై కెనడాకు మరో దేశం నుంచి సమాచారం,,,కెనడా వద్ద భారత దౌత్యవేత్తల సంభాషణల ఆధారాలు

international |  Suryaa Desk  | Published : Fri, Sep 22, 2023, 08:41 PM

ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల దౌత్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇరు దేశాలూ దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకోవడం.. కెనడా పౌరులకు వీసాలను సైతం భారత్ నిలిపివేసే పరిస్థితి వచ్చింది. కెనడా ప్రధాని వ్యాఖ్యలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన భారత్.. ఇవన్నీ అసంబద్దమైన, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని కొట్టిపారేసింది. అంతేకాదు, కెనడా తన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ తమతో పంచుకోలేదని స్పష్టం చేసింది.


కానీ, అందుకు తగిన ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయన్నది కెనడా అధికారుల వాదన. ఈ విషయాన్ని సీబీసీ న్యూస్‌కు కెనడా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నిజ్జర్ హత్యలో భారత పాత్రకు సంబంధించి కెనడాలోని భారత దౌత్యవేత్తల సంభాషణలకు సంబంధించిన ఆధారాలు, నిఘా సమాచారం తమవద్ద ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ సమాచారం కెనడా ఇంటెలిజెన్స్ నుంచి రాలేదు. ‘ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలియన్స్’ (కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) లో ఒక దేశం నుంచి సమాచారం వచ్చినట్టు కెనడా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


దీని ఆధారంగా భారత దౌత్య అధికారులపై నిఘా ఉంచి సమాచారం రాబట్టినట్టు చెబుతున్నాయి. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు సహకారం కోరుతూ కెనడా జాతీయ భద్రత, నిఘా సలహాదారు జోడీ థామస్ రెండుసార్లు భారత్‌కు వెళ్లినట్టు పేర్కొన్నాయి. ఆగస్టులో 4 రోజులు, సెప్టెంబరులో ఐదు రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉన్నట్టు తెలిసింది. జీ20 శిఖరాగ్ర సమావేశానికి కెనడా ప్రధాని ట్రూడోతో కలిసి జోడీ థామస్ వచ్చినట్టు సమాచారం.


నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందనడానికి సాక్ష్యాలు ఉన్నాయంటూ ప్రైవేటు మార్గాల్లో పంచుకున్నప్పటికీ దీన్ని భారత అధికారులు ఖండించలేదని కెనడా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికైతే కెనడా తన ఆరోపణలకు సాక్ష్యాలను విడుదల చేయలేదు. చట్టబద్ధమైన ప్రక్రియలో భాగంగా తర్వాత బయటకు వస్తాయని చెబుతున్నాయి. గురువారం ఐక్యరాజ్యసమితిలో కెనడా ప్రధాని గురువారం మాట్లాడుతూ.. జీ20 సదస్సు సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు నిజ్జర్ హత్య విషయాన్ని ప్రస్తావించినట్టు ట్రూడో పునరుద్ఘాటించారు. ‘నేను భారత ప్రధానమంత్రితో ప్రత్యక్షంగా స్పష్టం చెప్పాను.. అందులో నా ఆందోళనలను ఎటువంటి అనిశ్చితి లేకుండా పంచుకున్నాను’ అని చెప్పారు. ‘ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంతో న్యాయాన్ని నిర్ధారించడానికి కలిసి పనిచేయాలి’ అని ట్రూడో భారత్‌కు పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com