ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాచిగూడ, యశ్వంత్‌పూర్ రైలు ట్రయల్ రన్,,అనంతపురంలో ఆగిన వందేభారత్ రైలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 22, 2023, 07:12 PM

అనంతపురంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగింది. కాచిగూడ- యశ్వంతపూర్‌ వందేభారత్‌ రైలు ట్రయిల్‌రన్‌ నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున షెడ్యూల్‌ ప్రకారం 5.30 గంటలకు వందేభారత్ రైలు కాచిగూడ రైల్వేస్టేషన్‌లో 8 కోచ్‌లతో బయలుదేరింది. ట్రయిల్‌ రన్‌లో భాగంగా డోన్‌కు 20 నిమిషాలు ముందుగా, అనంతపురానికి 8 నిమిషాలు ముందుగా చేరుకుంది. ధర్మవరంలోనూ కాసేపు ఆగింది. యశ్వంతపూర్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకొని, 2.40 గంటలకు యశ్వంతపూర్‌ నుంచి తిరిగి బయలుదేరింది. ఈ వందేభారత్ తిరుగు ప్రయాణంలో అనంతపురానికి 5.24 గంటలకు చేరుకొని 5.25 గంటలకు బయలుదేరింది. అనంతపురం స్టేషన్‌లో బీజేపీ నేతలు రైలు వద్దకు చేరుకొని జాతీయ పతాకాన్ని ఊపి స్వాగతం పలికారు. నాయకులు తమ ఆనందం వ్యక్తం చేస్తూ సెల్ఫీ దిగారు. ఈ నెల 24 (ఆదివారం)న కాచిగూడ- యశ్వంతపూర్‌ వందే భారత్‌ రైలును ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.


ఈ వందేభారత్ కాచిగూడలో బయలుదేరి యశ్వంతపూర్‌కు వెళుతుంది. అదే రోజు రాత్రి తిరిగి కాచిగూడకు వస్తుంది. ఆదివారం రైలు ప్రారంభమైనా.. సోమవారం నుంచి రైలుకు కేటాయించిన షెడ్యూల్‌ ప్రకారం నడుస్తుంది. ట్రయల్‌ రన్‌లో 8 కోచ్‌లతో నడిపారు. ఈ వందేభారత్ ప్రారంభించాక ఎన్ని కోచ్‌లతో నడుపుతారన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. రైలు ప్రయాణ ఛార్జీలను నిర్ణయించలేదు. ఈ రైలులో ఎగ్జిక్యూటివ్‌, ఎకానమీ ఛైర్‌కార్లు ప్రస్తుతం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం రోజు ప్రధాని నరేంద్ర మోదీ 9 వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఏపీ మీదుగా మరో రైలు ప్రారంభంకానుంది.. విజయవాడ నుంచి చెన్నైకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభంకానుంది. ఈ రైలు విజయవాడ నుంచి ప్రారంభమై తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్‌లలో ఆగుతుంది. గురువారం ఈ రైలు నడవదు.. ప్రతి రోజూ విజయవాడలో ఉదయం 5.30కు బయలుదేరి మధ్యాహ్నం 12.10కి చెన్నై వెళుతుంది. ఈ రైలు తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20కి బయలుదేరి విజయవాడకు రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది. వాస్తవానికి విజయవాడ నుంచి చెన్నై వెళ్లే రైళ్లన్నీ గూడూరు నుంచి నేరుగా వెళతాయి. విజయవాడ-చెన్నై వందేభారత్‌ రైలు మాత్రం గూడూరు నుంచి శ్రీకాశహస్తి, రేణిగుంట, అరక్కోణం, తిరువళ్లూరు మీదుగా చెన్నైకి వెళుతుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఏపీ మీదుగా ఇప్పటికే రెండు రైళ్లు నడుస్తున్నాయి.. సికింద్రాబాద్ నుంచి విశాఖకు ఓ రైలు నడుస్తోంది. మరో రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రారంభిస్తున్న రెండు రైళ్లు ఏపీ మీదుగా నడవనున్నాయి. కాచిగూడ యశ్వంత్‌పూర్‌ రైలు రాయలసీమలోని రైల్వే స్టేషన్ మీదుగా నడవనుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com