ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను ప్రాణాలతో ఉండకపోవచ్చు.. బాబును జాగ్రత్తగా చూసుకో

national |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 05:20 PM

జమ్మూ కశ్మీర్‌‌లోని అనంతనాగ్‌ జిల్లా కొకెర్‌నాగ్‌ అటవీ ప్రాంతంలో ముష్కరుల కాల్పుల్లో అమరులైన అధికారుల విషాదగాథలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రదాడిలో కన్నుమూసిన జమ్మూ కశ్మీర్ పోలీస్ విభాగం డీఎస్పీ హుమయూన్‌ భట్‌ కన్నుమూయడానికి ముందు.. గాయాలతోనే తన భార్యకు ఫోన్‌ చేశారు. తాను ప్రాణాలతో ఉండకపోవచ్చని, బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని ఆమెకు చెప్పిన చివరి మాటలు ప్రతి ఒక్కళ్లనీ కంటతడిపెట్టిస్తున్నాయి. రాష్ట్రీయ రైఫిల్స్ కల్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, మేజర్‌ ఆశిష్‌ ధొనక్‌లతో కలిసి హుమయూన్‌ భట్‌ కూడా ఆపరేషన్‌ను ముందుండి నడిపిస్తుండగా.. ముష్కర మూకలు విచక్షణారహితంగా తూటాల వర్షం కురిపించాయి.


ఈ దాడిలో హుమయూన్ భట్‌ తీవ్రంగా గాయపడ్డాడు. తాను ఇక బతకడం కష్టంమని విషయం అతడికి అర్థమైపోయింది.. వెంటనే కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. తొలుత తన తండ్రి, రిటైర్డ్‌ ఐజీ గులాం హసన్‌ భట్‌తో మాట్లాడిన హుమయూన్.. తాను ఉగ్రవాదులతో జరిగిన పోరులో గాయపడ్డానని, అయినా తనకు ఏమీ కాదని ధైర్యం చెప్పారు. అనంతరం తన భార్య ఫాతిమాకు వీడియోకాల్‌ చేశారు. ‘‘నేను బతకకపోవచ్చు.. ఒక వేళ నేను చనిపోతే.. మన బిడ్డను జాగ్రత్తగా చూసుకో’’ అని ఆమెకు చెప్పాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే భట్‌ తుదిశ్వాస విడిచారు.


ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ స్పందిస్తూ..‘‘ఆపరేషన్‌లో డీఎస్పీ హుమయూన్‌ గాయపడిన విషయాన్ని వెంటనే ఆయన తండ్రికి తెలియజేశాను.. దీంతోపాటు అక్కడేం చేస్తున్నామో వీడియో కాల్‌ చేసి ప్రత్యక్షంగా చూపించాం. స్థానికులు, సహాయ బృందాలు అక్కడకు చేరుకొనే సమయానికే రక్తం ఎక్కువగా పోవడంతో హుమయూన్ ప్రాణాలు కోల్పోయారు’’ అని తెలిపారు. దాదాపు 15 రోజుల కిందటే హుమయూన్‌ తొలి పెళ్లిరోజు జరుపుకోగా.. అతడి రెండు నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు.


ఉగ్రవాదులు పీర్ పంజాల్ పర్వతాల్లోని ఎత్తైన ప్రదేశాలో నక్కి భద్రతాదళాలను లక్ష్యంగా చేసుకొన్నాయి. దాడిలో గాయపడిన అధికారులను వెంటనే ఘటనా స్థలం నుంచి ఆస్పత్రికి తరలించడం భద్రతా బలగాలకు సాధ్యం కాలేదు. దీంతో వారు అక్కడే గాయాలతో ఉండాల్సి వచ్చింది. మరోవైపు, కొకెర్‌నాగ్‌లో దాదాపు 100 గంటల నుంచి ఎన్‌కౌంటర్‌ కొనసాగుతూనే ఉంది. అక్కడ పర్వతాల్లోని ఓ గుహ వంటి స్థావరంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆదివారం ఉదయం దానిని గ్రేనేడ్లతో పేల్చివేసింది.


ఉగ్రవాదులు తమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను కాపాడుకొనేందుకు ఆగి ఆగి కాల్పులు జరుపుతున్నారు. ఇక్కడ ఎంత మంది ఉగ్రవాదులున్నారనే విషయం ఇప్పటికీ స్పష్టత లేదుదు. ఈ ఆపరేషన్‌ కోసం డ్రోన్లు, హెలికాప్టర్లను సైన్యం మోహరించింది. ముష్కరులు అడవి, ఎత్తైన పర్వత ప్రదేశాల్లో యుద్ధాలలో శిక్షణ పొందిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రమాదకరమైన ఆ ప్రాంతంలోకి లాజిస్టిక్‌లను ఏర్పాటు చేయడానికి చాలా సమయం పడుతోంది. ఈ రకమైన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం చాలా కష్టమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలోని పట్టణాలు, గ్రామాలలో మోహరించిన భద్రతా దళాలు తీవ్రవాద మద్దతు నిర్మాణాలను చాలా వరకు ధ్వంసం చేశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com