ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే.. చంద్రబాబు అరెస్ట్పై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం. మాట వరసకైనా సమాచారం ఇవ్వకపోవడంపై గవర్నర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు గవర్నర్ను సీఐడీ అధికారులు సంప్రదించలేదని తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును అరెస్టు చేయాలంటే అవినీతి నిరోధక చట్టం కింద గవర్నర్ అనుమతి తప్పనిసరి. అయితే.. అవినీతి నిరోధకర చట్టం-2018 సవరణల ప్రకారం.. ప్రజాప్రతినిధులు, అంతకుముందు సీఎంలు, మంత్రులుగా పనిచేసి వారెవరైనా.. అవినీతికి పాల్పడినట్టు ప్రభుత్వం దృష్టికి వస్తే.. అన్ని వివరాలతో నివేదిక తయారు చేసి దాన్ని గవర్నర్కు సమర్పించాలి. ఆ తర్వాత గవర్నర్ను నుంచి అనుమతి వచ్చిన తర్వాతే విచారణ చేపట్టాల్సి ఉంటుంది. కానీ... ఈ రోజు చంద్రబాబు అరెస్టు విషయంలో మాత్రం గవర్నర్కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. మీడియాలో వచ్చిన వార్తల ద్వారానే గవర్నర్ తెలుసుకోవాల్సి వచ్చిందని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఇక చంద్రబాబు అరెస్టు చెల్లనే చెల్లదంటూ పలువురు మాజీ అధికారులు చెప్పటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం, దర్యాప్తు చేపట్టడం చట్టవిరుద్ధమని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ(సి) ప్రకారం గవర్నర్ అనుమతి కచ్చితంగా ఉండాలని తెలిపారు. ఒకవేళ గవర్నర్ అనుమతి తీసుకుని ఉంటే మాత్రం.. ఆ పత్రాలు చూపించాల్సి ఉంటుందన్నారు. గవర్నర్ అనుమతి లేకపోతే దర్యాప్తు చెల్లదని స్పష్టం చేశారు. గవర్నర్ అనుమతి లేకుండా అదుపులోకి తీసుకుంటే.. అది కచ్చితంగా అక్రమ నిర్బంధమే అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలా చేస్తే.. సదరు అధికారులపై చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయని నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు.