ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కసారిగా కుప్పకూలిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు,,,వెంటనే ఆస్పత్రికి తరలింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 09, 2023, 07:58 PM

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అస్వస్థతకు గురయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు విషయం తెలియడంతో పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. పాలకొల్లులోని ఎమ్మెల్యే నిమ్మల ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. ఆయన ఇంటి దగ్గరకు పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ కేడర్, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో నిమ్మల కిందపడి అస్వస్థతకు గురయ్యారు.


రామానాయుడ్ని ఆస్పత్రికి తరలించాలని విజ్ఞప్తి చేసినా పోలీసులు పట్టించుకోలేదని నిమ్మల అనుచరులు ఆరోపిస్తున్నారు. దీంతో రామానాయుడికి ఏం జరిగినా పోలీసులదే బాధ్యతంటూ నినాదాలు చేశారు. టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాటలోనే ఆయన అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నిమ్మల కుప్పకూలిపోయారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. ఆయన్ను కొద్దిసేపటి తర్వాత ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నది తెలియాల్సి ఉంది.


టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపై నిరసనలు చేస్తున్నారు.అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామనాయుడు.. టీడీపీ కార్యకర్తలతో కలిసి కె. కోటపాడులో అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అటు తిరుపతిలోని మున్సిపల్ సర్కిల్‌లో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఏపీ సీఎం జగన్ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతపురంలో ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి ఆందోళన చేశాడు. చంద్రబాబును వెంటనే విడుదల చేయకపోతే వాటర్ ట్యాంక్ పైనుంచి దూకుతానని బెదిరిస్తూ.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు.


అటు నర్సీపట్నం నియోజకవర్గంలో పోలీసులు ఎక్కడికక్కడా పహారా కాస్తున్నారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి చుట్టూ భారీ బందోబస్తు చేపట్టి .. హౌజ్ అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా నూజివీడులో టీడీపీ శ్రేణులు ఓ స్కూటీతో పాటు.. వైసీపీ పార్టీ చిహ్నం ఫ్యానును తగలబెట్టారు. ఈ ఘటనలో పది మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. తిరుపతిలో రోడ్డుపైకి వచ్చిన ఆందోళన కారులు.. టైర్లు తగలబెడుతూ నినాదాలు చేస్తూ.. నిరసన చేపట్టారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం టీడీపీ శ్రేణులను అరెస్టు చేసి పోలీస్ స్టేషనుకు తరలించారు.


టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసనకు దిగారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడలో ఉన్న లోకేశ్ విజయవాడ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంతో నారా లోకేశ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. తన వెంట నాయకులు ఎవరూ లేరని.. కుటుంబ సభ్యుడిగా నేను ఒక్కడినే వెళ్తున్నానని.. తనని అడ్డుకునే హక్కు పోలీసులకు లేదని భీష్మించుకు కూర్చున్నారు. రాజ్యాంగం చేతబట్టుకుని చట్టం తెలీదా అంటూ పోలీసులను ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా క్యాంప్ సైట్ వద్ద తన బస్సు ముందే బైఠాయించి నారా లోకేశ్ నిరసన తెలిపారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com