తెలుగుదేశం పార్టీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు పోలీసులు తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. 34 మంది టీడీపీ నేతలపై రౌడీషీట్లు తెరవాలంటూ వివిధ పోలీసు స్టేషన్లనుంచి ఈనెలలో పలమనేరు డీఎస్పీకి ప్రతిపాదనలు వెళ్లినట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఆ ప్రతిపాదనల్లోని టీడీపీ నాయకుల జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. ‘ఏపీలో పోలీసులు రూల్ ఆఫ్ లాను విస్మరించి వ్యవహరిస్తున్న తీరు నిజంగా చాలా బాధాకరం. కుప్పం నియోజకవర్గంలోని పోలీసులు వైసీపీ నేతలతో కుమ్మక్కయ్యారనడానికి ఇక్కడ టీడీపీ శ్రేణులపై నమోదవుతున్న రౌడీషీట్లే నిదర్శనం. 2022 ఆగస్టునుంచి 2023లో మొదటి మూడు నెలల్లోనే కోకొల్లలుగా కేసులు నమోదయ్యాయి. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించడమేకాక, రౌడీషీట్లు ఓపెన్ చేసి బెదిరిస్తున్నారు. టీడీపీకి పనిచేయొద్దంటూ క్యాడర్ను బెదిరిస్తున్నారు. ఇది రాజకీయ ప్రతీకారానికి సంబంధించిన స్పష్టమైన కేసు. టీడీపీ క్యాడర్పై పోలీసులు రౌడీషీట్లు తెవరడంవల్ల వైసీపీ నేతలు రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు. నియోజకవర్గంలోని 34 మంది టీడీపీ శ్రేణులపై రౌడీషీట్లు తెరవాలంటూ ఆయా పోలీసు స్టేషన్లనుంచి పలమనేరు డీఎస్పీకి ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం ఉంది. ఇది వైసీపీ, పోలీసులు కుమ్మక్కయ్యారనడానికి పక్కా నిదర్శనం. కుప్పంలో ఏమాత్రం చట్టబద్ధమైన పాలన నడవడంలేదు. కుప్పం ప్రజలు శాంతి ప్రేమికులు, అమాయకులు. వారి తప్పేమీ లేకుండానే నేరస్థులుగా చేసిన ఘనత, మీ నాయకత్వంలోని పోలీసులకు దక్కుతుంది. ఎస్డీపీవో ఎన్.సుధాకర్రెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్ఐ కృష్ణయ్య పాత్ర ఇందులో ప్రధానమైంది. పదిహేను ఎఫ్ఐఆర్లలో ఎక్కువమంది ఫిర్యాదుదారులు పోలీసు అధికారులు లేదా రెవెన్యూ అధికారులే ఉండటం కేసులు పెట్టడం వెనుక ఉన్న దురుద్దేశపూరిత ఉద్దేశాలను స్పష్టం చేస్తోంది’ అని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.