ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బలవంతపెట్టిన ఫ్యామిలీ.. కాదనలేకపోయిన సీఎం.. కర్నూలులో ఇంట్రెస్టింగ్ సీన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 06:40 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికీ తెలసిందే. ఆహారం, ఆరోగ్యం విషయంలో ఆయన ఎంత స్ట్రిక్ రూల్స్ పాటిస్తారో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రిగా సమీక్షలు, సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలోనూ.. ఆయన టైమ్‌కు ఆహారం తీసుకుంటూ ఉంటారు. రాత్రి ఏడున్నరలోపే డిన్నర్ పూర్తి చేస్తూ ఉంటారు. ఇక చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం, టైమ్ తప్పకుండా భోజనం.. ఇలా అన్నీ టైమ్ ప్రకారం ఫాలో అవుతూ ఉండటంతోనే ఈ వయసులోనూ చంద్రబాబు ఇంత ఫిట్‌గా ఉంటారని చంద్రబాబును దగ్గర నుంచి చూసిన వారు చెప్పే మాట.


అయితే మంగళవారం ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగానే చింతగింజల వెంకటేష్ అనే లబ్ధిదారుడి ఇంటికి వెళ్లారు చంద్రబాబు. చింతగింజల వెంకటేష్‌కు వృద్ధాప్య పింఛన్ అందజేసి.. వారి కుటుంబంతో ముచ్చటించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి పక్కా ఇల్లు లేని విషయం తెలుసుకున్న సీఎం.. ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. అయితే పింఛన్ అందించిన తర్వాత తిరిగి వెళ్తుంటే.. చింతగింజల వెంకటేష్ కుటుంబసభ్యులు పాలు తాగాలంటూ చంద్రబాబును కోరారు. టైమ్ అవుతోందని వెళ్లాలని చంద్రబాబు చెప్పినప్పటికీ.. వారు పట్టుబట్టారు. దీంతో అధికారులను అడిగి కార్యక్రమాల వివరాలను తెలుసుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత ఆ ఇంటివారితో కలిసి వారిచ్చిన పాలు స్వీకరించారు.


అయితే సీఎం చంద్రబాబు నాయుడు బయట ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ విషయం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తెలిసిన విషయమే. అయితే చింతగింజల వెంకటేష్ కుటుంబసభ్యులు ఇచ్చిన పాలు తాగడంతో.. అక్కడున్న వారంతా కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ముఖ్యమంత్రికి ఇచ్చే ఆహారం విషయంలో సెక్యూరిటీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ముందుగానే అన్నీ తనిఖీ చేస్తుంది. అయితే ఇవేవీ లేకుండా కార్యకర్త కోరికను కాదనలేక చంద్రబాబు వారిచ్చిన పాలు స్వీకరించటంతో ఆ కుటుంబంతో పాటుగా అక్కడున్న టీడీపీ కార్యకర్తలు ఆనందపడ్డారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం ప్రతి నెలా ఓ గ్రామంలో చంద్రబాబు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకటో తేదీన తన స్వహస్తాలతో పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలోనూ చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com