విదర్భ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి మరట్వాడ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి విస్తరించిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణశాఖ. రాయలసీమ, కోస్తాల్లో మంగళవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడ్డాయి. అలాగే రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో ఐదు రోజుల పాటూ వర్షాలు కొనసాగే అవకాశం ఉందంటున్నారు
మరోవైపు రాయలసీమలో ముఖ్యంగా అనంతరం,నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపుల వర్షంతో కూడిన "పిడుగులు" పడే అవకాశం ఉందంటోంది ఏపీ విపత్తుల సంస్థ. ఎక్కడైనా ఎపుడైనా ఉరుములు మెరుపులతో వర్షం ఉన్నప్పుడు చెట్ల కింద ఉండొద్దని సూచించారు. రైతులు, కూలీలు, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని.. అలాగే అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షంతో కూడిన "పిడుగులు" పడే అవకాశం ఉంది అంటున్నారు. చెట్ల కింద ఉండొద్దని.. దయచేసి అప్రమత్తంగా ఉండాలన్నారు.
బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తాతో పాటు యానాంలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయంటున్నారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది అంటున్నారు.
దక్షిణ కోస్తాలో కూడా బుధ, గురువారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వానలు పడతాయంటున్నారు. బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా బుధ, గురువారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది. మంగళవారం కూడా కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలో అక్కడక్కడా వానలు పడ్డాయి.
మరోవైపు తెలంగాణను కూడా వర్షాలు ముంచెత్తాయి. మహారాష్ట్ర మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు కింది స్థాయిలో గాలులు వీస్తున్నాయి. దీంతో బుధ, గురువారాల్లోనూ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. మంగళవారం హైదరాబాద్తో పాటూ చట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. భాగ్యనగరంలో మంగళవారం రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. రెండు గంటల వ్యవధిలోనే సుమారు 8 సెంటీమీటర్ల వరకు వాన పడింది. వర్షంతోపాటు ఈదురుగాలులు వీచాయి.