ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలాంటి కథనాలు ప్రసారం చేయడం దుర్మార్గం: షర్మిల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 26, 2023, 08:20 PM

వివేకానందరెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కథనాలు ప్రసారం చేయడం దుర్మార్గమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈ మేరకు బుధవారం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. మా చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి ప్రజల మనిషి అని.. ఒక ప్రజా నాయకుడు అని అన్నారు.


చిన్నాన్న వివేకానందరెడ్డి గురించి తమ కంటే పులివెందుల, వైఎస్సార్ జిల్లా ప్రజలకే ఎక్కువ తెలుసని వైఎస్ షర్మిల అన్నారు. జిల్లాలో ఎవరైనా ఆయన దృష్టికి ఏదైనా సమస్యను తీసుకొస్తే.. కలెక్టర్ కార్యాలయానికైనా, చిన్న పంచాయతీ ఆఫీసుకైనా నేరుగా చిన్నాన్నే వెళ్లి పరిష్కరించే వారని చెప్పారు. చిన్నాన్న వివేకానందరెడ్డి ఎలాంటి వారంటే ప్రజల సమస్యల పరిష్కారం కోసం సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ రైళ్లలో కూడా ప్రయాణించేవారని చెప్పారు.


అలాంటి వివేకానందరెడ్డి మీద కొన్ని మీడియా సంస్థలు దారుణంగా ప్రచారం చేస్తున్నాయని వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. వివేకా వ్యక్తిత్వం గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే అర్హత ఆ మీడియా సంస్థలకు లేదని స్పష్టం చేశారు. మీడియా సంస్థలకు విలువలు ఉండాలి.. అవి లేని రోజున విశ్వసనీయత కోల్పోతారన్నారు.


వివేకానందరెడ్డిని ఒక ప్రజా నాయకుడిగా మాత్రమే చూడాలని వైఎస్ షర్మిల అన్నారు. ఈ రోజున వివేకానందరెడ్డి మన మధ్య లేరని.. అసలు లేని వ్యక్తి మీద, తాను సంజాయితీ ఇచ్చుకోలేని ఆయన వ్యక్తిగత జీవితాన్ని తీసుకొని ఇంత ఘోరంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దారుణమన్నారు.


ఇక, వైఎస్ వివేకానందరెడ్డిని ఆస్తుల కోసం సొంత కూతురు, అల్లుడే చంపి ఉంటారని ఈ కేసులో నిందితుడు, కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను వైఎస్ షర్మిల తిప్పికొట్టారు. వివేకా ఆస్తుల గురించి చెప్పే దాంట్లో లాజిక్కే లేదని స్పష్టం చేశారు. సునీత మా చిన్నాన్నకు ఒక్కగానొక్క కూతురు అని.. ఆయన ఆస్తులన్నీ ఎప్పటి నుంచో సునీత పేరు మీదే ఉన్నాయని వెల్లడించారు. అలాంటప్పుడు ఆస్తుల కోసం, ఇంకెవరికో రాసిస్తాడని హత్య చేశారని అనడంలో అసలు లాజిక్కే లేదన్నారు.


ఒక వేళ సునీత భర్త రాజశేఖరరెడ్డి ఆస్తి కోసమే ఇదంతా చేశాడు అంటే.. అప్పుడు చంపాల్సింది వివేకానందరెడ్డిని కాదు.. సునీతను చంపాల్సి ఉందని వైఎస్ షర్మిల అన్నారు. ఎందుకంటే ఈ ఆస్తులన్నీ ఫస్ట్ నుంచి సునీత పేరుపైనే ఉన్నాయని వెల్లడించారు. చిన్నాన్న వివేకానందరెడ్డి పేరు మీద ఉన్న అరకొర ఆస్తిని కూడా సునీత పిల్లలకు చెందేలా వీలునామా కూడా రాశారని వివరించారు. చిన్నాన్న వివేకానందరెడ్డి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని.. ఆయనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని వైఎస్ షర్మిల అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com