ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నామినేటెడ్‌ ఎమ్మెల్యేల ఎంపికపై ఎల్జీకి అధికారం.. తీవ్ర రాజకీయ దుమారం

national |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 10:08 PM

జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడుతుండగా.. నామినేటెడ్‌ ఎమ్మెల్యేల అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించదని, హంగ్‌ ఏర్పడవచ్చనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ ఏర్పాటులో ఐదుగురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. వీరిని నియమించే అధికారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌కు కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది బీజేపీకి లబ్ధి కలిగిస్తుందని, మంత్రి మండలి సిఫార్సు లేకుండానే నామినేటెడ్‌ ఎమ్మెల్యేలను నియమించే అధికారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కట్టబెట్టడం ఏంటి? అని విమర్శిస్తున్నారు. ఇది ప్రజల తీర్పును అపహస్యం చేయడమేనని కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు మండిపడుతున్నాయి.


నామినేటెడ్‌ ఎమ్మెల్యేలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆ పార్టీలు హెచ్చరించాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిగా ఏర్పడితే.. పీపుల్స్, డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ), బీజేపీలు ఒంటరిగానే పోటీచేశాయి. అయితే, ఈ రాష్ట్రంలో ఒంటరిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన దాఖలాలు లేవు. 2014లో పీడీపీ, బీజేపీలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగా.. 2018లో కూలిపోయింది. ఆ మరుసటి ఏడాదే అంటే 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ను రద్దుచేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. దీంతో ఆ ఏడాది జరగాల్సిన ఎన్నికలు వాయిదాపడుతూ వచ్చాయి.


జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఐదుగురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలతో సభ్యుల సంఖ్య 95కి పెరుగుతుంది. ఎన్నికైన ఎమ్మెల్యేల మాదిరిగా నామినేటెడ్‌ సభ్యులకూ ఓటు హక్కు కల్పిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు 48 మంది సభ్యుల మద్దతు అవసరం. ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం లభించని పక్షంలో ఈ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటులో అత్యంత కీలకం అవుతారు. అయితే, నామినేటెడ్‌ సభ్యుల నియామకంపై న్యాయనిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ప్రభుత్వ ఏర్పాటులో నామినేటెడ్‌ సభ్యుల పాత్రపై స్పష్టత లేదని సుప్రీంకోర్టు సీనియర్‌ లాయర్ అశ్వనీ కుమార్‌ దూబే తెలిపారు.


కానీ, పుదుచ్చేరిలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలను నియమించడాన్ని సుప్రీంకోర్టు 2018 నాటి తీర్పులో సమర్థించిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌‌కు తిరిగి రాష్ట్ర హోదాను పునరుద్దరిస్తే ఆ సమస్యే ఉత్పన్నం కాదని సీనియర్‌ న్యాయవాది శంకర నారాయణ అభిప్రాయపడ్డారు. జమ్మూ కశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా పునరుద్దిస్తామని సుప్రీంకోర్టుకు సొలిసిటర్‌ జనరల్‌ తెలిపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఫలితాలు రాకుండానే నామినేట్‌ సభ్యులను ఎల్జీ నియమించడంపై చర్చించడం తొందరపాటే అవుతుందని ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఎస్‌.ఎన్‌.ధింగ్రా వ్యాఖ్యానించారు.


నియోజకవర్గాల పునర్విభజనతో జమ్మూ ప్రాంతంలో సీట్ల సంఖ్య 43కు పెరిగితే.. కశ్మీర్‌లో 47గానే ఇది బీజేపీకి కలిసొస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ, హంగ్ వస్తే నామినేటెడ్ ఎమ్మెల్యేలుతో పాటు ఆ పార్టీకి అదనంగా ఐదుగురు ఎంపీల ఉండటం సానుకూలంశమని అంటున్నారు. జమ్మూ కశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇద్దరు మహిళలు, ఇద్దరు కశ్మీరీ పండిట్లు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వలసవచ్చిన ఒకర్ని నామినేట్ ఎమ్మెల్యేలుగా నియమించాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com