ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ టూ టీడీపీ...అధికార పార్టీలో గ్రూపులే కారణమా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 06:28 PM

అధికార వైసీపీ నుంచి ఇటీవల టీడీపీలో వలసలు పెరిగిపోతున్నాయి. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులున్నాయి. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. అలాగే, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత సత్రవాడ మునిరామయ్య తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షమంలో ఆ పార్టీలో చేరారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కృష్ణలంకకు చెందిన అధికార వైసీపీ నాయకుడు గోగుల రమేష్ టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తన అభిమానులతో కలిసి చంద్రబాబు సమక్షంలో రమేష్ టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో రమేష్‌ను వైసీపీ నేతలు బెదిరించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


ఈ నేపథ్యంలో అరవ సత్యం, దేవినేని అవినాష్, ఆయన అనుచరులపై తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయవాడ పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. గోగుల రమేష్ 2019 ఎన్నికల్లో వైసీపీ నాయకుడిగా పని చేశారని తెలిపారు. మూడేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలన నచ్చక టీడీపీలో చేరేందుకు ముందుకు వచ్చారన్నారు. ఈ మేరకు తాను, వంగవీటి రాధాకృష్ణ కలిసి చంద్రబాబుకు సమాచారం ఇచ్చామన్నారు.


తమ అధినేత చంద్రబాబు సమక్షంలో త్వరలోనే రమేష్ పసుపు కండువా కప్పుకోనున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు చంపుతామంటూ రమేష్‌ను బెదిరించడం దుర్మార్గమన్నారు. ఈ పరిణామాలను పోలీసు కమిషనర్‌ను కలిసి వివరించామన్నారు. అన్నీ విచారించి అవసరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారని గద్దె రామ్మోహన్ తెలిపారు.


బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. టీడీపీలో చేరాలనుకున్న నాయకులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేత దేవినేని అవినాష్, ఆయన అనుచురుడు అరవ సత్యంతో కలిసి రమేష్‌ను చంపుతామని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ బెదిరింపులపై పోలీసులకు కూడా రమేష్ ఫిర్యాదు చేశారన్నారు. పలు హత్యల కేసుల్లో అరవ సత్యం ఇప్పటికే ప్రధాన నిందితుడిగా ఉన్నారని గుర్తు చేశారు. అధికార పార్టీ నేతలు పోలీసులను కూడా తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవలే కృష్ణలంకలో మహిళలపై దాడులు చేసి, తిరిగి అదే మహిళలపై కేసులు పెట్టించారన్నారు. విజయవాడలో పాత పరిస్థితి తీసుకొచ్చేలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో పోలీస్ కమిషనర్‌ను కలిసి వారి అరాచకాలను వివరించామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com