ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ సారి బడ్జెట్ లో కేంద్రం రైతులకు తీపికబురు అందించనున్నదా

national |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 11:50 AM

ఈ సారి కేంద్ర బడ్జెట్ లో రైతు పథకమైన కిసాన్ సమ్మాన్ యోజన కింద ఆర్థిక సా‍యం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ కావడంతో దీనిపై ఈసారి అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా అన్నదాతకు ఏదైనా తీపికబురు అందుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో.. రైతులకు పంటసాయం ఏటా రూ.6000 చొప్పున అందిస్తున్న విషయం తెలిసిందే. దీనిని నాలుగు నెలలకు ఓసారి 3 విడతలుగా అందిస్తుంది. అయితే.. ఇది రైతులకు ఏమాత్రం సరిపోట్లేదని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. దీంతో.. ఈ సారి బడ్జెట్‌లో రైతులకు ఈ పంట సాయం పెంపు యోచనను పరిశీలించినట్లు, దీనిపై ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.


పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇప్పటివరకు 12 విడతలుగా ఆర్థిక సాయాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 13వ విడత నిధులు త్వరలో రైతుల అకౌంట్లో పడనున్నాయి. రైతులకు పురుగుల మందులు, ఎరువులు, విత్తనాలు కొనేందుకు ఎక్కువ ఖర్చు అవుతోందని, ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వారికి నిధులు ఎక్కువగా అందించాలని అన్నారు ఆగ్రోకెమికల్స్ కంపెనీ ధనుక గ్రూప్ ఛైర్మన్ ఆర్‌జీ అగర్వాల్.


ప్రస్తుతం రైతులకు నాలుగు విడతలుగా మొత్తం పంట సాయంగా రూ.6 వేలు అందుతున్న నేపథ్యంలో ఈ మొత్తాన్ని మరో రూ.2 వేలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అప్పుడు ఇన్‌స్టాల్‌మెంట్లను పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఏడాదికి 4 ఇన్‌స్టాల్‌మెంట్ల చొప్పున ప్రతి 3 నెలలకుఓసారి పంట సాయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి.


ఇంకా ఆయిల్‌సీడ్ ప్రొడక్షన్‌ను పెంచి.. వంటనూనెపై దిగుమతి సుంకాన్ని కూడా తగ్గించాలని కొందరు కోరుతున్నారు. దీనిపై కూడా కేంద్రం ఈ బడ్జెట్‌లో ప్రకటన చేయాలని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రైతులు సాగు చేసుకునేందుకు వీలుగా మరింత అధునాతన సాంకేతికతను పరిచయం చేయాలని, డ్రోన్లు, కృత్రిమ మేధను వారికి మరింత దగ్గరకు చేయాలని చాలా మంది నుంచి డిమాండ్ వినిపిస్తోంది. మరి బడ్జెట్‌లో ఈసారి వీరికి ఏమైనా మరిన్ని ప్రోత్సాహకాలు ఉంటాయా? కేంద్రం ఏం ప్రకటన చేయనుందో? అని అందరిలో ఆసక్తి ఉంది.


ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతాారామన్.. వార్షిక బడ్జెట్‌ను తొలుత లోక్‌సభలో తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు రోజు అంటే జనవరి 31న ఆర్థిక సర్వే విడుదల కానుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి. అయితే తొలుత ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో తొలి రెండు రోజుల్లో క్వశ్చన్ అవర్, జీరో అవర్ ఉండదని ఇప్పటికీ పార్లమెంటరీ బులెటిన్‌లో వెల్లడించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com