ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ సహకారంతో జాతీయ పార్టీ హోదా దక్కింది: అరవింద్ కేజ్రీవాల్

national |  Suryaa Desk  | Published : Sat, Dec 10, 2022, 12:16 AM

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లతో ఆమ్‌ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కిందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ‘గొప్ప అవకాశాన్ని కల్పించడంలో సహకరించిన గుజరాత్‌ ప్రజలు, ఆప్‌ కార్యకర్తలకు ధన్యవాదాలు’ అంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. గుజరాత్‌ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన వీడియో ప్రసంగం చేశారు. దేశంలో కొన్ని పార్టీలకే జాతీయ పార్టీ హోదా లభిస్తుందని.. పదేళ్ల కిందట చిన్న పార్టీగా ప్రారంభమైన ఆప్‌ ఇప్పుడు జాతీయ పార్టీగా ఎదిగిందని కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు.


ఈసారి గుజరాత్‌లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని, ఎన్నికలకు ముందు పేపర్ మీద రాసి మరీ చెప్పారు అరవింద్ కేజ్రీవాల్. ఇసుదాన్‌ గఢ్వీని ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తూ.. ‘నేను ఇవాళ ప్రకటించింది పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు మాత్రమే కాదు, గుజరాత్ కాబోయే ముఖ్యమంత్రి’ అంటూ ఆత్మవిశ్వాసం ప్రకటించారు. అయితే, కాషాయ ప్రభంజనంలో కేవలం 5 సీట్లను మాత్రమే దక్కించుకున్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చి ఒకరకంగా బీజేపీ పార్టీకే మేలు చేశారనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు.


ఈ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదాన్‌ గఢ్వీ కూడా ఓటమి పాలయ్యారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి సుమారు 20 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆప్‌ గుజరాత్‌ శాఖ అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా కూడా ఓటమి పాలయ్యారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి వినోద్‌ మోరాదియా ఏకంగా 64,629 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.


ఇదిలా ఉండగా.. గుజరాత్‌లో సాధించిన ఓట్ల శాతంతో ఆప్ ఇప్పుడు జాతీయ పార్టీ హోదా దక్కించుకోనుంది. జాతీయ హోదా దక్కాలంటే.. సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో పోటీ చేసి, పోలైన ఓట్లలో 6 శాతం చొప్పున ఓట్లు పొంది ఉండాలి. లేదా ఏవైనా 4 రాష్ట్రాల నుంచి 11 లోక్‌సభ సీట్లు సాధించాలి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాల్లో గెలుపొంది ఆ రాష్ట్రంలో 6 శాతం ఓట్లు దక్కించుకుంది. ఇప్పుడు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్రం మొత్తం మీద 12 శాతం ఓట్లు సాధించింది. దీంతో జాతీయ పార్టీగా అవతరించేందుకు ఆప్ అర్హత సాధించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com