ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసుల పరిష్కారానికి సమర్థత...మౌళిక వసతుల కల్పన ఎంతో అవసరం: సుప్రీంకోర్టు సీజేఐ

national |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 12:28 AM

 కోర్టుల్లో పెండింగ్‌ కేసుల సమస్యకు జడ్జీల సంఖ్యను రెట్టింపు చేయడంతోనే పరిష్కారం లభించదని, సమర్థులైన న్యాయమూర్తులతో పాటు కోర్టుల్లో తగినంత మౌలిక సదుపాయాలూ అవసరమేనని సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు కోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను రెట్టింపు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టేందుకు నిరాకరించారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ... అలహాబాద్‌ హైకోర్టులో మంజూరైన 60 జడ్జీల పోస్టులను భర్తీ చేయడమే కష్టంగా ఉందన్నారు. బాంబే హైకోర్టులో ఇప్పటి కన్నా అదనంగా ఒక్క జడ్జీని కూడా నియమించలేమని, ఇందుకు వసతుల కొరతే కారణమని పేర్కొన్నారు.


న్యాయమూర్తుల నియామకాల్లో జాప్యంపై కేంద్రం, న్యాయ వ్యవస్థల మధ్య ఇప్పటికే వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీజేఐ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. తాను అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు 160 మంది జడ్జిల సంఖ్యను 20 శాతం పెంచాలని అప్పటి న్యాయ మంత్రి సూచించారని సీజేఐ తెలిపారు. ‘‘నేను దానికి అభ్యంతరం చెప్పాను.. 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడం మాకు కష్టంగా ఉందని చెప్పాను.. మనకు మంచి న్యాయమూర్తులు ఎక్కడ దొరుకుతారు? న్యాయమూర్తులు కావడానికి ఎందుకు నిరాకరిస్తారని మీరు మంచి న్యాయవాదులను అడిగారా?’’ అని అన్నారు.


అమెరికా, బ్రిటన్ సుప్రీంకోర్టులు ప్రతి సంవత్సరం 100-150 కేసులను విచారించాలని నిర్ణయిస్తాయని సీజేఐ వ్యాఖ్యానించారు. ‘‘మేము కూడా అదే విధానాన్ని అనుసరిస్తే మనకు పెండింగ్ కేసు ఒక్కటి కూడా ఉండదు. కానీ మనకు స్వంత వ్యవస్థ ఉంది.. ఇక్కడ చిన్న కారణాలకు కూడా సుప్రీంకోర్టు వరకు అన్ని రకాల వ్యాజ్యాలతో పాటు న్యాయపరమైన సమయం, భారం న్యాయమూర్తులపై పడుతుంది’’ అని పేర్కొన్నారు. సీజేఐ ధర్మాసనం విచారణ చేపట్టేందుకు నిరాకరించడంతో అశ్వినీ ఉపాధ్యాయ్‌ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటానని తెలిపారు.


ప్రస్తుతం సుప్రీంకోర్టులో 69,781 కేసులు, హైకోర్టుల్లో 59.6 లక్షల కేసులు, జిల్లా కోర్టుల్లో 4.3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల పరిమితి సీజేఐతో కలిపి 34 కాగా.. ఇంకా ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైకోర్టుల్లో 1,108 మంది జడ్జిలకు గానూ 336 ఖాళీలు, జిల్లా కోర్టుల్లో 24,827 పోస్టులు ఉండగా 6,604 ఖాళీలు ఉన్నాయి. నవంబరు 1 నాటికి దేశంలో అన్ని కోర్టుల్లో కలిపి సుమారు 5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com