ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అకస్మికంగా మరణించిన గజరాజు..శోక సముద్రంలో భక్తులు

national |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 12:29 AM

మనకు బాాగా కావాల్సిన వారు ఈ లోకం నుంచి దూరమైతే  మనకు కలిగే మనోవేధన అంతా ఇంతా కాదు. అలాగే మనకు బాగా దగ్గరైన ఏ జంతువునైనా దూరమైతే అంతే బాధ కలుగుతుంది. కానీ దేవుడిలా ఆశీర్వదించేవారు దూరమైతే ఆ బాధ కూడా వర్ణాతీతం. ఇదిలావుంటే ఆ ఆలయానికి వచ్చే భక్తులను వినాయకుడితో పాటు ఓ ఏనుగు కూడా ప్రేమగా దీవించేది. చిన్న పిల్లలు కూడా ఏమాత్రం బెరుకు లేకుండా ఆ గజరాజం వద్దకు వెళ్లేవారు. అలాంటి గజరాజం ఆకస్మికంగా కన్నుమూసింది. బుధవారం (నవంబర్ 30) ఉదయం రోజూ మాదిరిగానే మావటిలు తనను మార్నింగ్ వాక్‌కు తీసుకెళ్లగా.. మధ్యలోనే కుప్పకూలింది. గుండెపోటుకు గురై మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. పుదుచ్చేరిలో మనాకుల వినాయక ఆలయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ వార్త తెలిసి భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఏనుగు ‘లక్ష్మీ’ పార్థీవదేహానికి నివాళి అర్పించేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఏనుగు పార్థీవదేహానికి నివాళి అర్పించారు.


1995లో ఆ ఏనుగు పదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ వ్యాపారి వినాయక ఆలయానికి అందజేశారు. నాటి నుంచి అక్కడే ఉంది. స్వామి వారి కైంకర్యాలలో పాల్గొనేది. ఆలయానికి వచ్చే భక్తులను ఆశీర్వదించేది. విదేశీ భక్తులు కూడా ఈ ఏనుగు ఆశీర్వాదాలు తీసుకొని మురిసిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆలయానికి ఎప్పుడు వచ్చినా ‘లక్ష్మీ’ ఆశీర్వాదాలు ఇచ్చేదంటూ గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు గవర్నర్ తమిళిసై.


లక్ష్మీని బుధవారం ఉదయం సాధారణ నడక కోసం ఇద్దరు మావటిలు బయటకు తీసుకెళ్లారని.. ఓ పాఠశాల సమీపానికి చేరుకోగానే రోడ్డుపైన ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని ఆలయ సిబ్బంది తెలిపారు. అంతవరకు ఆరోగ్యంగానే ఉన్న ఆ ఏనుగు అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్లే చనిపోయిందని భావిస్తున్నారు. ఏనుగు సంరక్షణ చూస్తున్న స్థానిక వెటర్నరీ డాక్టర్ కూడా ఇదే విషయాన్ని తెలిపారు.


లక్ష్మీ మృతికి సంతాపసూచకంగా ఆలయ ద్వారాలు మూసివేశారు. కూలిపోయిన ప్రదేశం నుంచి భారీ క్రేన్ సాయంతో ఎత్తి ట్రక్కులో ఆలయ ప్రాంగణానికి తరలించారు. అక్కడ భక్తులు నివాళి అర్పించేదుకు అవకాశం కల్పించారు. అనంతరం ఆలయ అర్చకులే శాస్త్రోక్తంగా అంత్యక్రియలు పూర్తిచేశారు. అంతిమ యాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com