ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లేందుకు హైదరాబాద్ బాచుపల్లి నుంచి బయల్దేరారు.దీంతో అనుమతి లేదంటూ శంభీపూర్ రాజు ఇంట్లోనే వారిని గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో పాడి కౌశిక్ రెడ్డి, శంభీపూర్ రాజు వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.కాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ నేతలను కలవడంపై పాడికౌశిక్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. అంతేకాదు గాంధీ ఇంటికి వెళ్తామని హెచ్చరించారు. దీంతో అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు సీరియస్ అయ్యారు. హైదరాబాద్ కొండాపూర్లోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు అరికెపూడి గాంధీ వెళ్లారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాలు రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి కిటికీలు ధ్వంసం అయ్యాయి.దీంతో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి అరికెపూడి ఇంటికి శుక్రవారం వెళ్తామని పాడికౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు బాచుపల్లిలోని రాజు ఇంటికి కౌశిక్ రెడ్డి వెళ్లారు. అనుచరులు, కార్యకర్తలతో కలిసి అక్కడి నుంచి వివేకానందానగర్లోని గాంధీ ఇంటికి బయల్దేరారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. శంభీపూర్ రాజుతో పాటు పాడి కౌశిక్ రెడ్డిని ముందస్తు అరెస్ట్ చేశారు.