ఇందిరా మహిళా శక్తి పథకంపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలని సెర్ఫ్ కమిషనర్ దివ్య దేవరాజన్ ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాలకు అందించే వివిధ పథకాలపై హైదరాబాద్ నుంచి సెర్ఫ్ కమిషనర్,పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ బాధ్యులు వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల అదనపు, లోకల్ బాడీస్ కలెక్టర్లు, డీఆర్డీఓలు, వెటర్నరీ, మత్స్య శాఖ అధికారులతో బుధవారం మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా పాడి గేదెల పెంపకం, కోడి పిల్లల పెంపకం, రిటైల్ ఫిష్ ఔట్ లెట్ తదితర అంశాలపై వివరించారు.
దరఖాస్తుల స్వీకరణ, దానికి కావాల్సిన పత్రాలు, లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్, బ్యాంక్ రుణాలు, శిక్షణ వివరాలు తెలిపారు. స్త్రీ నిధి రుణాల రికవరీ శాతం పెంచాలని ఆదేశించారు. మహిళా సంఘాల బాధ్యులకు ఆక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ చేయించడంపై సూచనలు చేశారు. జిల్లా మహిళా సమాఖ్య భవనాలు లేని చోట స్థలం గుర్తించాలని సూచించారు. రాష్ట్రంలో '1962'వాహనాలు 100 ఉన్నాయని పశు సంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. పశువుల పెంపకందారులు హెల్ప్ లైన్1962ను సేవలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా వెటర్నరీ అధికారి రవీందర్ రెడ్డి, డీఆర్డీఓ డీపీఎం పద్మయ్య పాల్గొన్నారు.