ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 08, 2024, 10:39 PM

తెలంగాణను వర్షాలు వీడటం లేదు. రాష్ట్రంలో రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. 3 రోజుల పాటు వాయుగుండం కొనసాగే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.


భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, ములుగు, సూర్యాపేట, భూపాలపల్లి, మహబూబాబాద్, జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు చెప్పారు. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌నూ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అవసరం అయితేనే బయటకు రావాలని హెచ్చరించారు.


ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం (సెంప్టెంబర్ 7) భారీ వర్షాలు కురిశాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు అత్యధికంగా మహబూబాబాద్‌లో 18.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా తల్లాడలోనూ 12.2 సెం.మీ, రంగారెడ్డి జిల్లా చుక్కాపూర్‌లో 11.1 సెం.మీ, అమనగల్‌లో 9.8 సెం.మీ, భద్రాద్రి జిల్లా చంద్రుగొండలో 9.3 సెం.మీ వర్షం కురిసిందని చెప్పారు. దీంతో మున్నేరు నదితో పాటు పలు వాగులకు వరద ఉద్ధృతి పెరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.


నేడు కూడా ఖమ్మం జిల్లాకు భారీ వర్ష సూచన జారీ చేసిన నేపథ్యంలో మున్నేరు వాగు మరోసారి పొంగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం రాత్రి ఖమ్మం బయల్దేరారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని స్థానిక అధికారులను భట్టి ఆదేశించారు. ముంపునకు గురి కాకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తోంది. శ్రీశైలం జలాశయం 8 గేట్లు ఎత్తి 2.70 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ 24 గేట్లు ఎత్తి 2.21 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com