ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దాని గుట్టును తర్వలోనే రట్టు చేస్తా: సబితా ఇంద్రారెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 08, 2024, 10:12 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన హైడ్రా.. మరోసారి దూకుడు పెంచింది. మధ్యలో భారీ వర్షాల కారణంగా కాస్త సైలెంట్ అయిన హైడ్రా.. వానలు తగ్గుముఖం పట్టటంతో టాప్ గేర్ వేసినట్టు కనిపిస్తోంది. ఏక కాలంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న అక్రమ కట్టడాలపైకి బుల్డోజర్లు పంపించి.. నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తోంది. మరోవైపు.. హైడ్రా కూల్చివేతలపై రాజకీయ నేతల నుంచి విమర్శలు కూడా అదే స్థాయిలో వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.


రంగారెడ్డి జిల్లా మణికొండలోని అల్కపూర్ టౌన్ షిఫ్ సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో తన కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సబితా.. హైడ్రా అనేది ఒక పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని అభివర్ణించారు. మీడియా, సోషల్ మీడియాలో హడావుడి చేయడం తప్పా.. హైడ్రాకు ఏం పని లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధానిలో మాజీ సీఎం కేసీఆర్ మార్క్ లేకుండా చేసేందుకే.. హైడ్రాను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు.


అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా.. 8 నెలలుగా కేసీఆర్ మీద అన్ని రకాలుగా బురదజల్లే కార్యక్రమాలే చేపడుతున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రకరకాలుగా ప్రయత్నిస్తున్నా.. కేసీఆర్ మార్క్ చేరిపి వేయడంలో విఫలమవుతూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలన్ని విఫలమవుతూ వస్తుండటంతో.. కొత్తగా హైడ్రాను రంగంలో దించి సామాన్యులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.


ఇదిలా ఉంటే.. ఔటర్ రింగు రోడ్డు చుట్టూ 30 వేల ఎకరాల్లో 4 లక్షల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని.. అందులో 10 శాతం కూల్చేసినా గొప్ప విషయమేనని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రోజుకు నాలుగు దిక్కుల్లో హైడ్రా కూల్చివేతలు చేపడుతోందని.. ఆ సంస్థకు ఒక ప్రణాళిక లేదని ఆరోపించారు. ఏ ఒక్క చెరువును సరియైన పద్ధతిలో కాపాడింది లేదని.. ఫలితంగా సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. సామాన్యుల ఉసురు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కచ్చితంగా తాకుతుందని విమర్శించారు.


గత 30 ఏళ్ల క్రితం పైసా పైసా కూడబెట్టుకొని నిర్మాణాలు చేసుకుంటే.. ఈరోజు వచ్చి ఆ నిర్మాణాలన్నింటినీ అక్రమం అంటూ కూల్చివేస్తుంటే గుండెపోటు వచ్చి చనిపోతారని వివరించారు. అలా జరిగితే ఈ పాపం ఎవరిదో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. హైడ్రా అంటేనే ఒక డ్రామా అని.. ఆ డ్రామా గుట్టును త్వరలోనే రట్టు చేస్తామని సబితా ఇంద్రా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com