ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫేమస్ అయ్యేందుకు ఇలాంటి పనులా.... సజ్జనార్ సీరియస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2024, 07:33 PM

ప్రస్తుతం యువత సమాజంలో బతకటం మానేసి సోషల్ మీడియాలో బతకటం అలవాడు చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు.. వికృత చేష్టలన్నీ చేస్తూ.. సమాజం ఏమనుకుంటుందనేది పూర్తిగా పక్కన పెట్టేశారు. తాము చేసే పనుల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా.. వేరేవాళ్లకు ఏదైనా లాభమో, నష్టమో ఉంటుందా అన్నది ఏమాత్రం ఆలోచించకుండా.. కేవలం లైకులు, షేర్ల కోసం మాత్రమే ఆలోచిస్తుండటం శోచనీయం. వాళ్లు చేస్తున్న విపరీతమైన పనులకు సామాన్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కూడా. ఇలా ఓ యువకుడు చేసిన వికృత చేష్టలకు ఏకంగా.. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌కు తీవ్ర ఆగ్రహం కలిగింది. దీంతో.. ఆ యువకుడు చేసిన పనిని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. సదరు యువకున్నే కాదు.. రీల్స్ మోజులో వికృత చేష్టలకు పాల్పడుతున్న యువత మొత్తానికి సజ్జనార్ ఓ మెస్సేజ్ ఇచ్చారు.


అయితే.. సజ్జనార్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసిన వీడియోలో.. "ఓ యువకుడు అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సును ఆపి.. ఎక్కుకుండా పారిపోతాడు." అయితే.. ఇది సోషల్ మీడియాలో తనకు ఎవడో తలకుమాసిన వ్యక్తి.. ఛాలెంజ్ ఇచ్చాడని.. దాన్ని పూర్తి చేశానంటూ వీడియోలో యువకుడు చెప్పటం ఉంది. కాగా.. ఈ వీడియోపై సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా!?.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారు. లైక్‌లు, కామెంట్ల కోసం పిచ్చి పనులు మానుకోండి. బంగారు భవిష్యత్ వైపునకు బాటలు వేసి.. జీవితంలో ఉన్నతంగా ఎదగండి." అంటూ సజ్జనార్ ట్విట్టర్‌ పోస్టులు రాసుకొచ్చారు.


అయితే.. ఇన్ స్టాగ్రాంలో పాపులారిటీ కోసం సాహస కృత్యాలు చేస్తుండే ఓ యువకుడు.. కామెంట్లలో నెటిజన్లు ఇచ్చే డేర్‌లను స్వీకరించి.. వాటిని చేస్తుంటాడు. ఇలా రకరకాల డేర్‌లు చేస్తూ.. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాధిస్తున్నాడు. ఈ క్రమంలోనే.. తన వీడియోల కింద ఓ నెటిజన్ "బ్రో బస్సుని ఆపి పరుగెత్తు బ్రో" కామెంట్ చేశారు. దీంతో.. సదరు యువకుడు ఆ డేర్‌కి యాక్సెప్ట్ చేసి.. రోడ్డుపై వస్తున్న ఓ ఆర్టీసీ పల్లెవెలుగు బస్సును సీరియస్‌గా ఆపి.. బస్సు పూర్తిగా ఆగిన తర్వాత.. ఎక్కినట్టే ఎక్కి అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఆ వ్యక్తి ఇచ్చిన డేర్‌ను పూర్తి చేశానని.. తర్వాత ఎలాంటి డేర్ చేయాలో కామెంట్లలో పెట్టాలంటూ మిగతా నెటిజన్లకు సూచించటం కొసమెరుపు.


 ఇలా.. రీల్స్ మోజులో పడి.. యువత పిచ్చి పిచ్చి పనులు చేస్తూ.. తమ ప్రాణాలను పణంగా పెట్టటమే కాకుండా.. కొంతమంది అయితే ఏకంగా ప్రాణాలు కూడా కోల్పోయారు కూడా. నిన్ననే.. ఓ 18 ఏళ్ల యువకుడు.. పాములు పట్టటాన్ని తన తండ్రి దగ్గర నేర్చుకుంటున్నాడు. ఇక.. పాములు పట్టటం పూర్తిగా వచ్చిందనుకుని.. ఓ నాగుపామును నోట్లో పెట్టుకుని విన్యాసాలు చేశాడు. ఈ క్రమంలోనే.. ఆ పాము ఎప్పుడు కాటేసిందో కానీ కాటయితే వేసింది. కానీ.. ఈ విషయాన్ని ఆ యువకుడు పట్టించుకోలదు. చివరికి పాము విషం ఒళ్లంతా పాకి ఆ యువకుడు తుది శ్వాస విడిచాడు. ఈ ఘటన.. కామారెడ్డి జిల్లా దేశాయిపేటలో జరిగింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com