ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలాపూర్ గణేష్‌ లడ్డూ వేలంలో కొత్త రూల్స్‌.. ఆ డబ్బు డిపాజిట్ చేసినవారికే ఛాన్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2024, 07:28 PM

వినాయక చవితి సంబురాలు ఘనంగా మొదలయ్యాయి. తొమ్మిది రోజుల పాటు గణేష్ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో వినయక చవితి అనగానే గుర్తొచ్చేది మొదటగా.. ఖైరతాబాద్ గణపతి అయితే.. రెండోది బాలాపూర్ గణేషుడు. ఖైరతాబాద్ గణపతి ఆకారంలో రికార్డు సృష్టిస్తే.. బాలాపూర్ గణేషుడు మాత్రం లడ్డూ వేలానికి ప్రసిద్ధి. బాలాపూర్ గణేషుని లడ్డూ ప్రసాదం దక్కించుకున్నవారికి అష్టఐశ్వర్యాలు కలుగుతాయని.. అనుకున్న కోరికలు నెరవేరుతాయన్నది ఏళ్లుగా వస్తున్న బలమైన నమ్మకం. అందుకే.. లక్షలు వెచ్చించి మరీ బాలాపూర్ లడ్డూను వేలం పాట పాడి మరీ దక్కించుకుంటుంటారు. అయితే.. ప్రతి ఏటా.. బాలాపూర్ లడ్డూ ఎంత పలికిందనేది అందరూ ఉత్కంఠగా చూస్తుంటారు.


అయితే.. లడ్డూను దక్కించుకునేందుకు జరిగే వేలం ప్రక్రియను నిర్వాహకులు మార్చేస్తున్నారు. ఇన్ని రోజులు జరిగినట్టుగా కాకుండా ఈసారి నుంచి మొత్తం మార్చేస్తున్నారు. కాగా.. 1980లో ఏర్పాటైన బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ 1994 ఏడాది నుంచి బాలాపూర్‌ లడ్డూ వేలం వేయటం ప్రారంభించింది. మొదటిసారి వేలం వేయగా.. రూ.450కే కొలను మోహన్ రెడ్డి అనే భక్తుడు.. లడ్డూను దక్కించుకున్నారు. ఆ లడ్డూను కుటుంబసభ్యులకు పంచడంతో పాటు పొలాల్లో కూడా చల్లటంతో.. బాగా కలిసొచ్చింది. దీంతో.. ఆ తర్వాతి ఏడాది కూడా మళ్లీ ఆయనే రూ.4500కు లడ్డూను కైవసం చేసుకున్నారు. ఆ ఏడాది కూడా ఆయనకు బాగా కలిసొచ్చిందన్న ప్రచారం జరగటంతో.. బాలాపూర్ లడ్డూ మహిళ కేవలం హైదరాబాద్‌లోనే కాదు.. అంతటా వ్యాపించింది. దీంతో.. బాలాపూర్ లడ్డూ ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. గతేడాది (2023) గరిష్ఠంగా 27 లక్షలు పలకగా.. ఈసారి 30 లక్షలు దాటనుందన్న చర్చ నడుస్తోంది.


అయితే.. 17 సంవత్సరాల పాటు కేవలం బాలాపూర్‌ గ్రామస్థులకు మాత్రమే ఈ లడ్డూ వేలంలో పాల్గొనే ఛాన్స్ ఉండేది. ఆ తర్వాత.. స్థానికేతరులకు కూడా వేలం పాటలో పాల్గొనే అవకాశం కల్పించటంతో.. డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే.. ఇప్పటివరకూ లడ్డూ వేలం పాటలో పాల్గొనాలంటే మొదటి రోజు నుంచి నిమజ్జనం వరకు.. భక్తుల నుంచి దరఖాస్తులను స్వీకరించేవారు. కానీ.. ఈసారి రూల్స్ మార్చేశారు.


అయితే.. ఈసారి బాలాపూర్ గ్రామస్థులతో పాటు వేలంలో పాల్గొనాలనుకునే వాళ్లంతా.. గతేడాది లడ్డూ వేలం విలువ అయిన 27 లక్షల రూపాయలను.. వేలానికి ఒకరోజు ముందు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. అలా డిపాజిట్ చేసి పేరు నమోదు చేసుకున్నా తర్వాతే.. వేలం పాటలో పాల్గొనాలన్నది ఈసారి రూల్ అన్నమాట. మరి.. ఇంత డిమాండ్ ఉన్న బాలాపూర్ లడ్డూ వేలం పాటకు ముందుగానే ఇంత డిమాండ్ ఉండటంతో.. మరి ఎంత మంది పాల్గొంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి.. ఈసారి ఎంత పలుకుతుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com