ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ హోటల్‌లో డ్రైనేజీ నీళ్లతోనే.... వీడియోలు వైరల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 06, 2024, 09:24 PM

బయట ఫుడ్ తినాలంటే ఒకటికి రెండు సార్లు కాదు.. ఓ వంద సార్లయినా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్నటివరకు.. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన వరుస దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడటంతో నోరెళ్ల బెట్టటం హైదరాబాద్ వాసుల వంతైంది. ఎందుకంటే.. పెద్ద పెద్ద హోటళ్లు, పేరుమోసిన రెస్టారెంట్లు, ఫేమస్ బేకరీలు.. ఇలా దేన్ని చూసినా.. కంపుకొట్టే కిచన్.. పాడైన పదార్థాలే దర్శనమిచ్చాయి. ఇక.. పాత్రలు శుభ్రం చేసే ప్రదేశమైతే.. గలీజు అన్న పదం చాలా తక్కువే. అలాంటి సన్నివేశాలు చూశాక.. బయట తినాలంటే జనాలు జంకుతున్న పరిస్థితి. కాగా.. ఇప్పుడు మరో దరిద్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది.


ఏకంగా డ్రైనేజీ నీళ్లతోనే.. పాత్రలు శుభ్రం చేస్తున్న భాగోతం బయటపడింది. డ్రైనేజీ నీళ్లతోనే గిన్నెలు, టీ గ్లాసులు, ప్లేట్లు కడుగుతూ.. మళ్లీ వాటిలోనే కస్టమర్లకు భోజనం, టీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకూ ఏ హోటల్ అని ఆరా తీస్తే.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.


సోషల్ మీడియా పోస్టుల ప్రకారం.. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో ఉన్న శ్రీ కృష్ణ ఉడుపి పార్క్ హోటల్‌లో ఈ నిర్వాకం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈహోటల్‌లో కొన్ని రోజులుగా పైపులు లీక్ అవుతుండడంతో.. ఫ్రెష్ వాటర్‌లో డ్రైనేజీ నీళ్లు కూడా కలిసి వస్తున్నాయి. దీంతో.. ఆ నీళ్లు కాస్త డ్రైనేజీ నీళ్లను తలపిస్తున్నాయి. అయినా సరే.. ఆ హోటల్ సిబ్బంది మాత్రం ఏమీ పట్టించుకోకుండా.. బహిరంగంగానే.. అందరూ చూస్తుండగానే.. ఆ బురద నీళ్లలోనే ప్లేట్లు, గిన్నెలు, టీ గ్లాసులు కడుగుతున్నారు. ఆ తర్వాత మళ్లీ వాటిని ఫ్రెష్ నీళ్లతో శుభ్రం చేస్తున్నారా అంటే.. అలాంటిదేమీ లేకుండా అందులోనే కస్టమర్లకు ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. ఆ హోటల్ యాజమాన్యం మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా.. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతోంది.


ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో.. అధికారులు ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. అయితే.. సోషల్ మీడియా పోస్టుల ప్రకారం ఇది.. నిజంగానే హైదరాబాద్‌లో జరిగిందా లేదా అన్నది కూడా తేల్చాల్సి ఉంది. ఇలాంటివన్నీ చూస్తే.. ఇక ప్రజలు హోటళ్లలో తినాలంటే ఒకటికి రెండు సార్లు కాదు రెండు వేల సార్లు ఆలోచిస్తారు. ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తున్న హోటళ్ల వల్ల.. జాగ్రత్తలు తీసుకుని.. కస్టమర్ల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించే హోటళ్లపై కూడా ప్రజలకు జుగుప్స కలిగే అవకాశం లేకపోలేదు. అందులోనూ.. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. అసలే వైరల్ ఫీవర్ల సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలోనే.. ఇలాంటి హోటల్స్ వల్ల ఫుడ్ పాయిజన్ కూడా తోడైతే.. ఇక ఎవరూ కాపాడలేరు.. జనాలు జర చూసుకుని హోటళ్లకు వెళ్లండి మరి..










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com