వర్షాకాలం నేపథ్యంలో దవాఖానల్లో రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీ హెచ్ సీ)ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ సేవలు, ఫార్మసీ, వ్యాక్సిన్ గది, ఆసుపత్రి ఆవరణను పరిశీలించారు. ఫిజియో థెరపీ సేవల రిజిస్టర్ తనిఖీ చేశారు. రోజు ఓపీ ఎందరు వస్తున్నారో ఆరా తీశారు.
అనంతరం ఆయన మాట్లాడారు. దవాఖాన ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో రక్త పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేయాలని సూచించారు. సీసీ టీవీ మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్నేహ, హోమియో డాక్టర్ డాక్టర్ దీప్తి, సిబ్బంది ఉన్నారు.