ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలుగోసారి అధికారంలోకి వస్తామని నమ్మకం లేదు, కానీ..: నితిన్ గడ్కరీ

national |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 10:39 PM

మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అతికొద్ది మంది రాజకీయ నాయకుల్లో కేంద్ర ఉపరితల రక్షణ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ ఒకరు. విపక్ష పార్టీపై ప్రశంసలు కురిపించడం.. సొంత పార్టీ నాయకులపై విమర్శలు చేయడానికి కూడా ఆయన వెనుకాడరు. ఇటీవల ప్రధాన మంత్రి పదవి గురించి గడ్కరీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా, ఆయన మరోసారి ఎన్డీయేను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తన సొంత నగరం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఈ సందర్భంగా తనతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలేను సరదాగా ఆటపట్టించారు.


పలు ప్రభుత్వాల్లో క్యాబినెట్ మంత్రి పదవి దక్కించుకున్న సామర్ధ్యం ఆయనది అన్నారు.


‘మేము కేంద్రంలో నాలుగోసారి అధికారంలోకి వస్తామని నమ్మకంగా చెప్పలేం.. కానీ రామ్‌దాస్ అథవాలే కేంద్ర మంత్రి అవుతారని కచ్చితంగా చెప్పగలను..’ అని అన్నారు. అయితే, తాను కేవలం జోక్ చేస్తున్నానని, దీన్ని సీరియస్‌గా తీసుకోవద్దని గడ్కరీ వివరణ ఇచ్చారు. ఎన్డీయేలో భాగస్వామి అయిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడైన రామ్‌దాస్ అథవాలే.. వరుసగా మూడోసారి మోదీ క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. నాలుగోసారి కూడా ఎన్డీయే అధికారంలోకి వస్తే మంత్రిని అవుతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.


త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అధికార మహాయుతి (శివసేన (షిండే), బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్)లో భాగస్వామి అయిన ఆర్పీఐ 10 నుంచి 12 స్థానాలను ఆశిస్తోంది. నాగ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఇదే విషయం వెల్లడించారు. ఉత్తర నాగ్‌పూర్, ఉమ్రేద్, ఉమర్‌ఖేడ్, యావత్మల్, వాషీమ్ సహా విదర్బలో మూడు నుంచి నాలుగు సీట్లలో తమ పార్టీ గుర్తుపైనే పోటీ చేస్తామని చెప్పారు.


‘ఆర్పీఐ మొత్తం 18 మందితో ప్రాథమిక జాబితాను రూపొందించాం.. కొద్ది రోజుల్లో మహాయుతి నేతలకు దానిని అందజేస్తాం.. కనీసం 10 నుంచి 12 సీట్లైనా మాకు ఇస్తారని ఆశిస్తున్నాం’ అని అన్నారు. బీజేపీ, శివసేన, ఎన్సీపీలు తమ కోటాలోని నాలుగు చొప్పున సీట్లు వదులకోవాలని అథవాలే అన్నారు.


మహాయుతిలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ చేర్చుకోవడం వల్ల, మాకు హామీ ఇచ్చినప్పటికీ రాష్ట్ర మంత్రివర్గంలో పదవి లభించలేదని అథవాలే పేర్కొన్నారు. తమ పార్టీకి క్యాబినెట్‌ పదవులు, రెండు కార్పొరేషన్ల చైర్మన్‌లు, జిల్లా స్థాయి కమిటీల్లో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే పవార్‌ చేరిక వల్ల ఇవన్నీ జరగలేదన్నారు. కానీ, ఈసారి మాత్రం మాకు సీట్ల విషయంలో సముచిత స్థానం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com