ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ప్రజలకు అలర్ట్,,,'మీ సేవ'లో కొత్తగా 9 రెవెన్యూ సేవలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 09:02 PM

తెలంగాణలోని మీ సేవ కేంద్రాలు పౌరులకు పలు రకాలైన ప్రభుత్వ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. మీ సేవ కేంద్రాల ద్వారా మరో తొమ్మిది రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మండల కేంద్రాల్లోని ఎమ్మార్వో కార్యాలయాల్లో కాకుండా ప్రజలకు అవసరమైన వివిధ ధ్రువీకరణ పత్రాలను మీ సేవ కేంద్రాల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా అందించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ కీలక నిర్ణయించారు.


ప్రస్తుతం ఎమ్మార్వోలు నేరుగా జారీ చేస్తున్న పత్రాలను ప్రజలు నేరుగా మీ సేవ కేంద్రాల నుంచి ఆన్‌లైన్‌లో పొందేలా చర్యలు చేపట్టారు. కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన తొమ్మిది రకాల పత్రాలకు సంబంధించిన వివరాలు 'మీ సేవ ఆన్‌ బోర్డ్‌'లో ఉంచేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం జిల్లా కలెక్టర్లను ఆదేశాలు జారీ చేశారు. పౌరుల పేరు మార్పిడి, తరచూ జారీ చేసే ఆదాయం, కుల తదితర ధ్రువీకరణ పత్రాలు, లోకల్‌ క్యాండిడేట్‌, విద్యార్థులకు అవసరమైన స్టడీ గ్యాప్‌ సర్టిఫికెట్‌, క్రీమీలేయర్, నాన్‌ క్రీమీలేయర్‌, మార్కెట్‌ విలువ, మైనారిటీ ధ్రువీకరణ, ఖాస్రా, పహాణీల వంటి పాత ధ్రువీకరణ పత్రాలు, ఆర్వోఆర్‌-1(బి) సర్టిఫైడ్‌ కాపీలు సైతం మీ సేవ కేంద్రాల నుంచి జారీ చేయనున్నారు.


ఎమ్మార్వో స్థాయిలోనే పరిష్కారం చూపండి..


ఇక రేవంత్ సర్కార్ త్వరలో భూ దస్త్రాలు, యాజమాన్య హక్కుల (ఆర్వోఆర్‌-2024) చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమమైంది. ఈ చట్టానికి సంబంధించి క్షేత్రస్థాయిలో కీలక సూచనలు అందాయి. ప్రధానంగా ఎమ్మార్వో స్థాయిలోనే అధికారాలు ఉండాలని ఎక్కువ మంది ప్రజల నుంచి విజ్ఞాపనలు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు జులై 2 నుంచి 23వ తేదీ వరకు ఆర్వోఆర్‌-2024 చట్టానికి సంబంధించిన ముసాయిదాను భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచి వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించారు.


అభ్యర్థనలన్నింటినీ పరిశీలించి కొత్త చట్టంలో చేర్చాల్సిన వాటి జాబితాను రూపొందించాలని కమిషనర్ నవీన్‌ మిత్తల్‌ సిబ్బందింకి సూచించినట్లు తెలిసింది. ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుండగా.. ఆ తర్వాత రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలన అనంతరం సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నాక ఆ మేరకు కొత్త ఆర్వోఆర్ చట్టంలో మార్పులు, చేర్పులు చేసే అవకాశాలున్నట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com