ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షాల ఎఫెక్ట్.... పాఠశాలలకు సెలవులపై సీఎస్ కీలక ఆదేశాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 07:34 PM

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో.. వాగులు వంగలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పోటెత్తుతున్న వరదలతో.. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్భందమయ్యాయి. ఈ క్రమంలోనే భారీ వర్షాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో.. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.


వర్షాలు ఎక్కువగా కురిసే జిల్లాల అధికారులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి.. పరిస్థితి సమీక్షించాలని ఆదేశించారు. మరోవైపు.. డ్యాములు, చెరువులు, కుంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు హైదరాబాద్ హెడ్ క్వార్టర్‌కి అప్డేట్ చేయాలని సీఎస్ సూచించారు.


భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు వెళ్లాల్సిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాకపోకలు కూడా నిలిచిపోవటంతో.. చాలా మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులను కూడా.. తిరిగి ఇంటికి పంపించేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే సూచన ఉన్న నేపథ్యంలో.. విద్యా సంస్థలకు సెలవుల అంశంలో పరిస్థితిని బట్టి ఆయా జిల్లా కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు.


మరోవైపు తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెండు రోజుల పాటు ఈ రెడ్ అలర్ట్ ఉంటుందని స్పష్టం చేసింది. అంటే.. ఆగస్ట్ 31వ తేదీ.. సెప్టెంబర్ ఒకటో తేదీన.. ఈ రెండు రోజులు అతి భారీ వర్షాలు పడనున్నట్లు హెచ్చరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో కొన్ని చోట్ల కుండపోత వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.


ఈ క్రమంలోనే.. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com